కూలీలు అడిగిన వెంటనే పనికల్పించాలి మీ కోసం కార్యక్రమంలో వినతి వైఎస్సార్ సీపీ జిల్లా పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ
ఒంగోలు సబర్బన్: ఇప్పటి వరకూ పెండింగ్లో ఉన్న ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పరిధిలోని ఉపాధి కూలీల వేతనాలు చెల్లించాలని వైఎస్సార్ సీపీ జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు నన్నెబోయిన రవి కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ జిల్లా పంచాయతీ రాజ్ విభాగం ఆధ్వర్యంలో ఉపాధి కూలీల సమస్యలపై ఒంగోలు నగరంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రకాశం భవన్లో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బీసీహెచ్.ఓబులేసుకు పార్టీ నాయకులతో కలిసివచ్చి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సన్నెబోయిన రవి కుమార్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ఉపాధి హామీ పనుల్లో కూలీలకు జరుగుతున్న అన్యాయంపై కలెక్టర్ పి.రాజాబాబు దృష్టికి తీసుకెళ్లామన్నారు. 2025 డిసెంబర్ నెల నుంచి పెండింగ్లో ఉన్న కూలీల వేతనాల విడుదలకు, జిల్లాలో ఉపాధి హామీలో జరిగిన అవినీతిపై విచారించి, పథకం సక్రమంగా జరిగేటట్టు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి కూలీలకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, పనుల వద్ద నీరు, నీడ, మందుల సౌకర్యం కల్పించాలన్నారు. అదేవిధంగా కూలీలు అడిగిన వెంటనే పని కల్పించి వలసలు ఆపాలన్నారు. నకిలీ మస్టర్లు అరికట్టి, నిజాయితీగా పనులు జరిగేట్టు చూడాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనుల్లో బయటపడిన అవినీతిపై చర్యలు తీసుకోవాలన్నారు. పనులు లేక అల్లాడుతున్న జిల్లా కూలీలకు సమృద్ధిగా పనులు కల్పించి, వలసలను ఆపి జిల్లాను ఆదుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటైనప్పటి నుంచి ఉపాధి పనుల్లో అవినీతి పెరిగిందన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు నన్నెబోయిన రవి కుమార్తో పాటు వైఎస్సార్ సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం ప్రధాన కార్యదర్శి ముల్లంగి రవీంద్ర రెడ్డి, ప్రకాశం జిల్లా యూత్ వింగ్ జనరల్ సెక్రటరీ బండ్లమూడి వెంకట రాజయ్య, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం జనరల్ సెక్రటరీ దేవరపల్లి అంజిరెడ్డి, ఘట్టమనేని అశోక్, ఒంగోలు పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షుడు కోటేశ్వరరావు, సన్నపు రెడ్డి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి, మీరావళి, వెన్నపూస వెంకటేశ్వర రెడ్డి, తాత నర్సింహా గౌడ్, యరజర్ల రమేష్ బాబు, రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి వెంకయ్య నాయుడు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రైవేటు కంటి ఆస్పత్రులు రిజిస్టర్ చేసుకోవాలి
ఒంగోలు టౌన్: ఈ నెల 30వ తేదీ లోపల జిల్లాలోని అన్నీ కంటి ఆస్పత్రులు తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయంలోని చాంబర్లో సోమవారం జిల్లాలోని కంటి ఆస్పత్రుల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ శుక్లం ఆపరేషన్ చేయించుకున్న వారి వివరాలను పోర్టల్లో నమోదు చేయాలని చెప్పారు. అనంతరం ఆస్పత్రి రిజిస్టర్, శుక్లం ఆపరేషన్లను నమోదు చేసే విధానం గురించి ఆన్లైన్లో శిక్షణ ఇచ్చారు. పోర్టల్ వినియోగం, ఉపయోగాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా అంధత్వ నివారణ సంఘ సెక్రటరీ డాక్టర్ నళిని, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ హేమంత్, పీఎంఓఓలు శ్రీనివాసరావు, ఎన్.వెంకటేశ్వర్లు, పెద్దకాకాని శంకర కంటి ఆస్పత్రి ప్రతినిధి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగం నాయకులు


