దర్శి: ‘ఎవ్వరూ అధైర్యపడొద్దు..మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. మండలంలోని బొట్లపాలెంలో వీరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన వారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఇటువంటి అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. రైతులకు తీవ్ర నష్టంవాటిల్లినా రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా బాబు ప్రభుత్వం విదిల్చిన పాపాన పోలేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కనీసం ఎరువులు, యూరియా కూడా అందించకపోవడంతో రైతులు బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో రైతులంతా కలిసి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ దొరక్క ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని మండిపడ్డారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు లేవన్నారు. ప్రభుత్వ అసమర్ధతతోనే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఆటోవాలాలు, చిన్న చిన్న లారీల యజమానులు, వాహనాలకు డీజల్ లేకపోతే బాడుగలకు ఎలా వెళ్తారని, వాహనాలకు ఫైనాన్స్ కిస్తీలు ఎలా కట్టాలని...తమ కుటుంబాలు ఎలా పోషించుకోవాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇంత దయనీయ పరిస్థితులు ఉన్నా ప్రభుత్వానికి, అధికారులకు చిమకుట్టినట్లయినా లేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా ఉంటా
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
ప్రభుత్వ అసమర్థతతోనే పెట్రోలు, డీజిల్ కొరత
దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి


