ఒంగోలు సబర్బన్/ఒంగోలు టౌన్: జిల్లాలోని పలు పెట్రోలు బంకులను సోమవారం కలెక్టర్ పి.రాజాబాబు, ఎస్పీ హర్షవర్థన్రాజు అధికారులతో కలిసి విడివిడిగా తనిఖీ చేశారు. పెట్రోలు, డీజిల్ కొరత కారణంగా రెండు రోజులుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. బంకుల నిర్వాహకులతో మాట్లాడి వివరాలు సేకరించారు. వాహనాలకు మాత్రమే ఆయిల్ నింపాలని, బాటిళ్లు, క్యాన్లతో వచ్చే వారికి, పెద్ద మొత్తంలో అడిగే వారికి ఆయిల్ పోయవద్దని ఆదేశింశారు. బ్లాక్ మార్కెట్కు తరలించినా, అధిక ధరలకు విక్రయించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్టాకు రిజిస్టర్లను పరిశీలించి వాహనదారులకు ఆయిల్ పోస్తున్న తీరుపై ఆరా తీశారు. ఒంగోలు – టంగుటూరు మధ్యలో హైవే పక్కనున్న పెట్రోలు బంకులను కలెక్టర్ తనిఖీ చేయగా, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, తహసీల్దార్ ఆంజనేయులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ హర్షవర్థన్రాజు ఒంగోలు, చీమకుర్తి పెట్రోలు బంకులను తనిఖీ చేయగా, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, తాలూకా సీఐ విజయకృష్ణ, చీమకుర్తి ఎస్సై సంపత్ పాల్గొన్నారు.


