● కలెక్టర్ విజయసునీత
మార్కాపురం:
జనగణనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కలెక్టర్ ఎం విజయసునీత అన్నారు. స్వీయ జనగణనకు మద్దతుగా పట్టణంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులతో కలిసి ఆదివారం 5కే రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యక్రమంలో రెండు దశల్లో జరుగుతుందన్నారు. ఈ నెల 30 వరకూ ప్రజలు తప్పనిసరిగా స్వీయ జనగణనలో పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. మొబైల్ యాప్ ద్వారా స్వయంగా ఇంటి వద్దే నమోదు చేసుకునే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ ఈ యాప్ను ఉపయోగించుకోవాలన్నారు. దేశాభవృద్ధి వికసిత భారత్ 2047 సాధనకు ఇది కీలకం కానుందన్నారు. ప్రతి పౌరుడు జనగణనలో పాల్గొని దేశ పురోగతికి పాటుపడాలన్నారు. డీఎస్పీ నాగరాజు, కమిషనర్ నారాయణరావు, తహశీల్దార్ చిరంజీవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఒంగోలులో 5కే రన్
ఒంగోలు సబర్బన్: జన గణన–2027 స్వీయ గణన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసుకుని సహకరించాలని డీఆర్ఓ బి.చిన ఓబులేసు ప్రజలకు సూచించారు. స్వీయ గణనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆదివారం ఉదయం ఒంగోలు కలెక్టరేట్ నుంచి నిర్వహించిన 5కే రన్ కార్యక్రమాన్ని డీఆర్ఓ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ.. స్వీయ గణనపై ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం దేశ వ్యాప్తంగా 5కే రన్ నిర్వహించారని చెప్పారు. ఎప్పుడూ లేని విధంగా జనగణనలో స్వీయ గణన విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. 2011 తరువాత 2021లో జనగణన చేపట్టాల్సి ఉండగా, కోవిడ్ కారణంగా వాయిదా పడిందని చెప్పారు. ఈ ఏడాది జనగణన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఒంగోలు మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ రాచగర్ల వెంకటరావు, జనాభా లెక్కల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాగా 5కే రన్ కలెక్టరేట్ నుంచి దక్షిణ బైపాస్లోని పాత జిల్లా పరిషత్ కార్యాలయం వరకు సాగింది.


