● ఎస్టీ కమిషన్ ఎదుట సమస్యలు మొరపెట్టుకున్న గిరిజనులు
యర్రగొండపాలెం: నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న మాకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్టీ కమీషన్ టీం ముందు పాలుట్ల గిరిజనులు తమ సమస్యలు వివరించారు. శనివారం రాత్రి ఎస్టీ కమీషన్ చైర్మన్ సొల్లా బొజ్జిరెడ్డి, కమిషన్ టీం సభ్యులు మండలంలోని పాలుట్ల గిరిజనగూడేన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ.. గూడెంలో తాగు నీటి సమస్యను పరిష్కరించాలని, ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు. గూడెంలో పక్కా గృహాలు నిర్మించుకునేందుకు, బావులు తవ్వుకోవడానికి అనుమతులు ఇవ్వాలని, తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. హౌసింగ్ మ్యాప్లో తమ గూడెం లేకపోవడం వల్ల తాము ఎటువంటి పథకాలు పొందలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల సమస్యలను మూడు నెలల్లో పరిష్కరించేదుకు చర్యలు తీసుకుంటామని, చైర్మన్ హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎస్టీ కమిషన్ సభ్యులు కె.లక్ష్మి, కె.పరమేశ్వర్లు ఉన్నారు.


