● కలెక్టర్ విజయసునీత
యర్రగొండపాలెం: భూగర్భ జలాలు అత్యంత తక్కువగా ఉన్న యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్న చెరువుల్లో పూడికతీత పనులు యజ్ఞంలా చేపట్టాలని కలెక్టర్ ఎం.విజయ సునీత సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక వైష్ణవి గార్డెన్స్లో గురువారం ఏర్పాటు చేసిన జలధార–జలహారతి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సాగునీటి కాలువలు, చెక్డ్యాంలు, చెరువులను సాగుకు అనుకూలంగా మార్చుకోవాల్సిన బాధ్యత తమ అందరిపై ఉందని, అధికారులతో పాటు సాగు నీటి సంఘాల అధ్యక్షులు, దాతలు ప్రభుత్వం చేపసట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముందుకు రావాలన్నారు. ఈ పథకం కింద జిల్లాకు రూ.13కోట్లు నిధులు కేటాయించగా నియోజకవర్గానికి రూ.9కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగిందని, మే చివరి నాటికి ఈ పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. కార్యక్రమంలో జేసీ పి.శ్రీనివాసులు, మార్కాపురం ఆర్డీఓ ప్రభాకర్, ఇరిగేషన్ ఎస్ఈ అబూతలిం పాల్గొన్నారు.


