ఒంగోలు సబర్బన్: నిషేధిత 22(ఏ) భూములకు సంబంధించిన పత్రాల పరిశీలన, నివేదిక రూపకల్పన ప్రక్రియలో ఏకరూపత ఉండాలని జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి అన్నారు. వీటికి సంబంధించిన పత్రాలను బుధవారం ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ ప్రక్రియ కోసం ఇప్పటికే ప్రత్యేక బృందాలను కలెక్టర్ నియమించారు. ఈ భూములకు సంబంధించిన పత్రాలను తొలుత తహసీల్దార్, ఆర్టీఓ పరిశీలించిన అనంతరం, కలెక్టరేట్ పరిపాలన విభాగంలోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్ల నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు పరిశీలించాల్సి ఉంటుంది. అనంతరం డీఆర్ఓ, జాయింట్ కలెక్టర్ పరిశీలిస్తారు. ఈ పరిశీలన ప్రక్రియలో ఏకరూపత కోసం బుధవారం ప్రత్యేకంగా పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారులకు, సిబ్బందికి వివిధ అంశాలపై జేసీ అవగాహన కల్పించారు. అదే విధంగా మే, జూన్ నెలల్లో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి ప్రణాళిక, ఈ – కేవైసీ, రీ సర్వే పైనా జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. కార్యక్రమంలో డీఆర్ఓ బి.చిన ఓబులేసు, కందుకూరు సబ్ కలెక్టర్ డి.హిమవంశీ, ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్వోలు పాల్గొన్నారు.


