ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే బూచేపల్లి, అన్నా
మార్కాపురం: మే 4వ తేదీన జిల్లా కేంద్రమైన మార్కాపురంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాలు, వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు. సోమవారం ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డితో కలిసి సదస్సు నిర్వహణపై ఏర్పాట్లను పరిశీలించారు. నాల్గవ తేదీ ఉదయం 10 గంటలకు పట్టణ శివార్లలోని సౌజన్య కల్యాణ మండపంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సదస్సుకు వచ్చే రైతులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ ఏర్పాట్లు చేయాలని బూచేపల్లి శివప్రసాద్రెడ్డి సూచించారు. ఉమ్మడి జిల్లాలోని 8 నియోజకవర్గాల ఇన్చార్జిలు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, వివిధ విభాగాల నాయకులు హాజరవుతారని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు, రైతుల ప్రయోజనాలపై, కృష్ణా జలాల వినియోగ ఆవశ్యకతపై రాయలసీమ ఎత్తిపోతల పథకం, వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై సదస్సులో చర్చిస్తారని చెప్పారు. మేధావులు, నిపుణులు, రైతు నాయకులు హాజరు కానున్నట్లు తెలిపారు. పూర్తి కరువు పీడిత ప్రాంతాల కోసం నిర్దేశించిన వెలిగొండ ప్రాజెక్టు, రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తికాకపోతే రాయలసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల రైతాంగానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. సదస్సును విజయవంతం చేయాలని అన్నా రాంబాబు విజ్ఞప్తి చేశారు. వారి వెంట అన్నా కృష్ణచైతన్యతోపాటు వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి షంషేర్ ఆలీబేగ్, మున్సిపల్ మాజీ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, పట్టణ పార్టీ అధ్యక్షుడు సలీమ్, ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ నారు బాపన్రెడ్డితోపాటు మార్కాపురం నియోజకవర్గంలోని పట్టణ, రూరల్, తర్లుపాడుకు చెందిన పలువురు మండలపార్టీ అధ్యక్షులు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.


