కలెక్టర్ విజయ సునీత గ్రీవెన్స్లో 204 అర్జీలు
మార్కాపురం టౌన్: రెవెన్యూ అర్జీల పరిష్కారంలో జాప్యాన్ని సహించనని కలెక్టర్ యం విజయసునీత చెప్పారు. మార్కాపురం కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్లో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఒకే సమస్యపై ప్రజలు పదే పదే వస్తున్నారని, ఈ ధోరణిని అరికట్టాలంటే భూ సమస్యలను త్వరగా పరిష్కరించడం ఒక్కటే మార్గమన్నారు. అధికారులు ఈ దిశగా చొరవ చూపాలని ఆదేశించారు. మొత్తం 204 అర్జీలు రాగా వీటిలో రెవెన్యూకు సంబంధించి 126, ఇతర సమస్యలపై 78 అర్జీలు వచ్చాయని కలెక్టర్ వెల్లడించారు.
చిత్తశుద్ధితో సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని ఆమె ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పీ శ్రీనివాసులు, మార్కాపురం, కనిగిరి ఆర్డీఓలు ప్రభాకర్, శివరామిరెడ్డి, మైనింగ్ ఏడీ రవివర్మ, ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ పద్మావతి, ఇన్చార్జి ఆర్టీఓ రాంబాబు, జిల్లా పంచాయతీ అధికారి బాలూనాయక్ తదితరులు పాల్గొన్నారు.
● మార్కాపురం మండలం బొడిచర్ల గ్రామానికి చెందిన ఎస్సీలు తాము నడుస్తున్న రహదారిని శ్మశాన వాటికకు వెళ్లే దారిని గ్రామానికి చెందిన కొందరు ముళ్లకంపలు వేసి మూసివేశారని కలెక్టరుకు వినతిపత్రం అందజేశారు. ఎస్సీ కాలనీ నుంచి ప్రధాన రహదారికి వెళ్లాలంటే సుద్దబావి వద్ద ఉన్న రహదారిని ఉపయోగించుకుంటున్నామని, అయితే ఈ దారి వెంట మమ్మల్ని నడవద్దంటూ మూసివేశారని గ్రామానికి చెందిన నారయ్య, దానమయ్య, బాల చెన్నయ్యతోపాటు మరికొందరు అర్జీ అందజేశారు.


