ఒంగోలు మెట్రో: థాయిలాండ్లో జరుగుతున్న వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ చాంపియన్షిప్ – 2006లో ఒంగోలుకు చెందిన పశుసంవర్థకశాఖ జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ కల్లు రాజేశ్వరి తొమ్మిది కిలోమీటర్ల వాక్, లాంగ్ జంప్లో గోల్డ్ మెడల్ సాధించారు. రాజేశ్వరి ప్రస్తుతం విజయవాడ హెడ్ ఆఫీస్లో జూనియర్ వెటర్నరీ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఆమెను పశుసంవర్థకశాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు, అడిషనల్ డైరెక్టర్ రజనీకుమారి అభినందించారు.
కొత్తపట్నం: అనుమానాస్పదస్థితిలో మహిళ మృతిచెందిన సంఘటన కొత్తపట్నం మండలంలోని గుండమాల సముద్ర తీరంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుండమాల గ్రామానికి చెందిన పెద్దసింగు ఎల్లమ్మ (50) కూలి పనులు చేసుకుంటూ జీవిస్తుంటుంది. శనివారం ఒంగోలు వెళ్లి హాస్పిటల్లో చూపించుకుని ఒంగోలులో ఉంటున్న తన కుమారుడు దగ్గరకు వెళ్లింది. రాత్రతా అక్కడే ఉంది. ఆదివారం ఉదయం తన బంధువుల ఇళ్లకు వెళ్లి వస్తానని చెప్పి బయలుదేరింది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో గుండమాల సముద్ర తీరం దగ్గరలో శవమై పడి ఉంది. అటువైపు వెళ్తున్న మత్స్యకారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్సై వేముల సుధాకర్బాబు సంఘటన స్థలానికి చేరుకుని మృతురాలిని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
సింగరాయకొండ: మద్యం మత్తులో ఓ దివ్యాంగుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని మూలగుంటపాడు పంచాయతీ జువ్వలగుంట చెరువు సమీపంలో రైల్వే ట్రాక్పై ఆదివారం ఈ సంఘటన జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. జరుగుమల్లి మండలం నందనవనం గ్రామానికి చెందిన వేమూరి జహంగీర్ (51) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. ఇతనికి చిన్నతనంలో కరెంటు షాకు కారణంగా ఎడమచేయి పనిచేయదు. అయినప్పటికీ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ ఎదుటి వారికి తనకు చేతనైన సహాయం చేసేవాడు. ఈ నేపథ్యంలో మద్యం మత్తులో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్కి తరలించినట్లు ఒంగోలు రైల్వే జీఆర్పీ ఎస్సై శ్రీరామ్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


