ఏఎంఆర్ సంస్థ అడ్డగోలు వసూళ్లపై ప్రజల ఆగ్రహం రోడ్డు మీద రాళ్ల పడేసి నిరసన తెలిపిన ప్రజలు గ్రామస్తుల ఆగ్రహంతో వెనక్కి తగ్గిన నిర్వాహకులు
పొదిలి రూరల్: గ్రానైట్ సీనరేజి వసూలు పేరుతో ఏఎంఆర్ సంస్థ అడ్డగోలు దోపిడీకి పాల్పడుతుండటంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పొదిలి మండలంలోని ఏలూరులో ఆదివారం గ్రామంలోని గ్రానైట్ ఫ్యాక్టరీల వద్ద ఉన్న రాళ్లను తమ సొంత అవసరాలకు వాడుకునేందుకు గ్రామస్తులు తీసుకెళ్తుండగా ఏఎంఆర్ సంస్థ సిబ్బంది ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. తమ వాహనాన్ని ఎందుకు ఆపారని అడగ్గా మీరు గ్రానైట్ రాయి తోలుకుంటున్నందుకు టాక్స్ కట్టాలని చెప్పడంతో గ్రామస్తులు మండిపడ్డారు. తమ సొంత గ్రామంలో రాయిని ఇంటి అవసరాలకు తీసుకెళ్తుంటే మీకెందుకు టాక్స్ కట్టాలని ప్రశ్నించారు. తాము ఎటువంటి టాక్స్ కట్టాల్సిన అవసరం లేదని వాదించారు. ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఎంతచెప్పినా ఏఎంఆర్ సిబ్బంది వినకపోయే సరికి గ్రామస్తులు ట్రాక్టరులో ఉన్న రాళ్లను రోడ్డుపై పడేసి నిరసన తెలిపారు. గ్రామంలోని చుట్టుపక్కల వారు అధిక సంఖ్యలో గుమికూడటంతో ఏఎంఆర్ సంస్థ సిబ్బంది వెనక్కు తగ్గారు. దీంతో గ్రామస్తులు నిరసన విరమించారు. ఏఎంఆర్ సంస్థ సిబ్బంది తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సిబ్బంది పనితీరు మార్చుకోకుంటే రోడ్డెక్కి రాస్తారోకో చేస్తామని హెచ్చరిస్తున్నారు.


