మార్కాపురం టౌన్: ఉపాధ్యాయ సమస్యలపై ఈనెల 21న మార్కాపురంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పీ రమణారెడ్డి చెప్పారు. ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి తక్షణమే 30 శాతం ఐఆర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు దశలవారీ పోరాటం చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ధర్నాకు అన్నీ మండలాల నుంచి ఉపాధ్యాయులు హాజరుకావాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్, సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం, మున్సిపల్, కేజీబీవీ, ఐటీడీఏ, మోడల్ స్కూల్, గురుకుల పాఠశాలలు, ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఎయిడెడ్ పాఠశాలల సమస్యలు, పెండింగ్ డీఏలు తదితర ఎన్నో సమస్యలతో కూడిన డిమాండ్స్ సాధించుకునేందుకు జరిగే ధర్నాలో ఉపాధ్యాయులు పాల్గొనాలని అన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మండ్ల రామాంజనేయులు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండారెడ్డి చెన్నారెడ్డి, యం మహేష్, కృష్ణారెడ్డి, కుందురు కాశిరెడ్డి, మండ్ల వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


