ఒంగోలు టౌన్: చేపల వేటకు వెళ్లిన ఒక వృద్ధుడు చెరువులో గల్లంతయ్యాడు. ఒంగోలు తాలూకా పోలీసుల కథనం ప్రకారం... ఒంగోలు మండలంలోని కరవది గ్రామానికి చెందిన విట్టా శ్రీనివాసరావు (68) మరో ఇద్దరు మిత్రులతో కలిసి కరవది చెరువులో చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తూ చెరువులో పడి శ్రీనివాసరావు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న తాలూకా ఎస్సై ఫణిభూషణ్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందితో కలిసి చెరువులో గాలించారు. సాయంత్రం పొద్దుపోయేంత వరకు వెతికినా శ్రీనివాసరావు ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో గాలింపు ఆపివేశారు. తిరిగి శనివారం గాలింపు చేపట్టనున్నట్లు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


