చీమకుర్తి: బైక్ రైడింగ్ సరదా ఒకరు ప్రాణం తీసింది. ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. చీమకుర్తిలోని ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతూ టీ కాలక్షేపం పేరుతో 10 మంది విద్యార్థులు పాఠశాల ఆవరణ నుంచి బయట ఉన్న టీ స్టాల్ వైపు వచ్చారు. వారిలో ఇద్దరు విద్యార్థులు స్నేహితుడి బైకు తీసుకొని సరదాగా చీమకుర్తి బైపాస్ రోడ్డులో రాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. వారిలో బైక్ నడుపుతున్న బొడ్డు తరుణ్పాల్ బైకు అదుపు తప్పడంతో రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టాడు. ప్రమాదంలో తరుణ్పాల్(15) అక్కడికక్కడే మృతి చెందాడు. బైకుపై వెనక కూర్చున్న మరో విద్యార్థి ఈర్ల రోహిత్ తలకు బలమైన గాయాలై పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన తరుణ్పాల్ తల్లిదండ్రులు బొడ్డు నాగేశ్వరరావు, నాగలక్ష్మి స్వస్థలం చీమకుర్తిలోని నెహ్రూనగర్లో నివాసం ఉంటున్నారు. వారికి ఒక కుమార్తె, కుమారుడు. ఇప్పటికే నాలుగు పరీక్షలు రాశారు. శనివారం మరో పరీక్షకు సన్నద్ధమవుతూ టీ కోసం అని ఇలా బయటకు వెళ్లి మృతి చెందడంతో తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. తీవ్రంగా గాయాలపాలై పరిస్థితి విషమంగా ఉన్న మరో విద్యార్థి ఈర్ల రోహిత్ చీమకుర్తిలోని జగన్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో సీఐ ప్రసాదరావు కేసు వివరాలను విచారిస్తున్నారు.
ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
పదో తరగతి పరీక్షలకు ప్రిపేర్ అవుతూ టీ కాలక్షేపం పేరుతో బైక్ రైడింగ్


