ఏ స్టేషన్లో పనిచేస్తున్నావు, మర్యాదగా పక్కకు తప్పుకో
● సీఐపై మంత్రి లోకేశ్ చిర్రుబుర్రు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ నెల్లూరు జిల్లా కావలి పర్యటన సందర్భంగా ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ సీఐకు వార్నింగ్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గురువారం విజయవాడ నుంచి కావలికి రోడ్డుమార్గంలో లోకేశ్ బయలుదేరారు. ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, సంతనూతలపాడు టీడీపీ ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, స్థానిక నాయకులు, కార్యకర్తలు మంత్రిని కలిసేందుకు టంగుటూరు టోల్ ప్లాజా వద్దకు వచ్చారు. లోకేశ్ కాన్వాయ్ 12వ నంబరు గేటు వద్దకు చేరుకున్న సమయంలో టోల్గేట్ సిబ్బంది నిర్లక్ష్యంతో గేటు పడిపోయింది. దీన్ని గమనించిన సింగరాయకొండ సీఐ హజరత్తయ్య అప్రమత్తమై పరుగున వెళ్లి గేటు తీయడంతో కాన్వాయ్ ముందుకు కదిలింది. అప్పటికే అక్కడ స్వల్పంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు లోకేశ్కు కనిపించారు. ఈలోపు కొందరు కార్యకర్తలు లోకేశ్ కారు వద్దకు దూసుకురాగా వారిని సీఐ హజరత్తయ్య అదుపు చేసేందుకు యత్నించారు. అప్పటికే తక్కువ మంది వచ్చారని అసహనంగా ఉన్న లోకేశ్..వచ్చిన వారిని కూడా అదుపు చేస్తోన్న సీఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపంగా సీఐ వైపు వేలు చూపిస్తూ.. ఎవరు నువ్వు.. పక్కకు తప్పుకో అంటూ హెచ్చరించారు. అయినప్పటికీ ఆయన అక్కడే నిలబడి ఉండటంతో ఏ స్టేషన్లో పనిచేస్తున్నావు, మర్యాదగా పక్కకు తప్పుకో అని గద్దించారు. దీంతో గత్యంతరం లేక సీఐ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
నాగులుప్పలపాడు: ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఊర చెరువులో పడి పన్నెండేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ విషాద సంఘటన గురువారం ఉదయం నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. కఠారి అఖిల్(12) గురువారం ఉదయం గ్రామంలోని ఊర చెరువు వద్ద ఆడుకుంటూ నీటిలో పడిపోయాడు. తల్లిదండ్రులు తమ కుమారుడు కనిపించలేదని చాలా సేపు గ్రామమంతా వెతికారు. ఉదయం 10 గంటల సమాయంలో చెరువు నీటిలో బాలుడి మృతదేహం తేలియాడుతుండటాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహాన్ని స్థానికులు బయటకు తీసి తల్లిదండ్రులకు అప్పగించారు.
కనిగిరిరూరల్: వాగులో పడి దివ్యాంగురాలు మృతి చెందిన సంఘటన కనిగిరి మండలంలోని చీర్లదిన్నెలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. చీర్లదిన్నెకు చెందిన కొప్పర్తి రోశయ్య రెండో కుమార్తె ధనలక్ష్మి(32) బుధవారం తమ గేదెలను మేపేందుకు పొలానికి వెళ్లింది. మానసిక దివ్యాంగురాలైన ఆమె నేరెళ్లవాగు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో పడి మృతి చెందింది. మృతదేహాం గురువారం ఉదయం వాగు నీటిలో పైకి తేలింది. మృతురాలి తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి.శ్రీరాం తెలిపారు.
ఏ స్టేషన్లో పనిచేస్తున్నావు, మర్యాదగా పక్కకు తప్పుకో
ఏ స్టేషన్లో పనిచేస్తున్నావు, మర్యాదగా పక్కకు తప్పుకో


