అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించండి
● కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు సబర్బన్: ప్రతి రోజూ కార్యాలయానికి రాగానే ప్రజా సమస్యల పరిష్కార వేదిక వచ్చిన అర్జీలను పరిశీలించడమే తొలి పనిగా పెట్టుకోవాలని కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. అర్జీల పరిష్కారంపై సంబంధిత విభాగ అధికారులతో మంగళవారం ప్రకాశం భవనంలోని తన చాంబర్లో ఆయన సమీక్షించారు. అర్జీల ఆడిట్, సకాలంలో పరిష్కారం, రీఓపెన్ కాకుండా చూడడం, అర్జీదారులతో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఆరా తీశారు. సమస్యలను సకాలంలో సహేతుకంగా పరిష్కరించడంతో పాటు అర్జీదారులతో మాట్లాడే తీరు కూడా గౌరవప్రదంగా ఉండాలన్నారు. అర్జీదారులకు ఫోన్ చేసి వారి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా రెవెన్యూ, పంచాయతీ, విద్య, రోడ్లు భవనాల శాఖలకు సంబంధించిన అర్జీలు పెండింగ్లో ఉన్నట్లు మీకోసం విభాగం జిల్లా నోడల్ ఆఫీసర్ మాధురి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అర్జీలను సకాలంలో పరిష్కరించడంలో జాప్యం చేస్తున్న విభాగాలను, అధికారుల వివరాలను ప్రతిరోజూ తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ ఆమెను ఆదేశించారు. అర్జీలను పరిష్కరించడంలో జాప్యం చేస్తున్న హనుమంతునిపాడు, పుల్లలచెరువు తహసీల్దార్లతో కలెక్టర్ అప్పటికప్పుడే ఫోన్లో మాట్లాడారు. డీపీఓ ముప్పూరి వెంకటేశ్వరరావు, డీఈఓ కిరణ్కుమార్, రోడ్లు భవనాల శాఖ ఎస్ఈ రవినాయక్లను తన చాంబర్కు పిలిపించి అర్జీల పరిష్కారంలో జాప్యం ఎంత మాత్రమూ సరికాదని స్పష్టం చేశారు. సమావేశంలో ‘మీకోసం’ అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్ కృష్ణమోహన్, సూపరింటెండెంట్ నాగజ్యోతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


