వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
● ఆరోగ్య సేవా జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ హేమంత్
కొత్తపట్నం: తుఫాన్ను ఎదుర్కొనేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి అవసరమైన వారికి వైద్య సేవలు అందించాలని, మందులు పంపిణీ చేయాలని ఆరోగ్య సేవా జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ హేమంత్ అన్నారు. తుఫాన్ నేపథ్యంలో సోమవారం మడనూరు తుఫాన్ సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించారు. వైద్య శిబిరంలో ఉండాల్సిన మందులను పరిశీలించారు. అత్యవసర మందులైన పాముకాటు, కుక్కకాటుకు సంబంధించిన ఇంజక్షను తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. 108 వాహనాన్ని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. బాలింతలు, గర్భిణులు, చిన్న పిల్లలపై దృష్టి సారించాలన్నారు. తుఫాన్ తీవ్రత తగ్గేంత వరకు వైద్య సిబ్బంది వారికి అందుబాటులో ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ నబీ, ఈతముక్కల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ నవ్యారెడ్డి, మెడికల్ సిబ్బంది పాల్గోన్నారు.
ఒంగోలు సబర్బన్: ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు వంద శాతం రాయితీలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఎస్సీ, ఎస్టీ ఇన్సెంటివ్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి రవి కుమార్కు వినతి పత్రం సమర్పించారు. యాక్షన్ కమిటీ ఆర్గనైజేషన్ కార్యదర్శి వీ భక్తవత్సలం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మొత్తం మీద 40 యూనిట్లకు సంబంధించి 20 మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రాజేష్, జాన్ వెస్లీ, ప్రశాంత్ సంపత్, క్రాంతి కుమార్, అనిల్ తదితరులుపాల్గొన్నారు.
ఒంగోలు సబర్బన్: ఎప్సీవీ పొగాకు పంట నియంత్రణ అవసరమని ఒంగోలు–2 వేలం కేంద్రం సూపరింటెండెంట్ జే.తులసి రైతులకు సూచించారు. ఈ మేరకు సోమవారం త్రోవగుంటలోని పొగాకు వేలం కేంద్రంలో రైతులతో సమావేశం నిర్వహించారు. పొగాకు బోర్డు ఒంగోలు–2 వేలం కేంద్రం పరిధిలోని రైతులు ఎఫ్సీవీ పొగాకు పంట నియంత్రణను కచ్చితంగా పాటించాలన్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు సాగు చేయాలన్నారు. 2025–26 పంట కాలానికి బోర్డు సూచించిన పరిమితి మేరకే పొగాకు సాగు చేయాలని కోరారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. 2025–26 పొగాకు పంట కాలానికి సంబంధించి బ్యారన్ ఇన్సూరెన్స్లో కొద్దిగా మార్పు జరిగినందున దానిని రైతులకు వివరించారు. నారుమడులు వేసేవారు తప్పని సరిగా బోర్డులో రిజిస్టర్ అవ్వాలని కోరారు. రైతులు రిజిస్టర్ అయిన వారి నుంచే నారు కొనుగోలు చేసి వారు ఇచ్చే రశీదుని బోర్డులో సమర్పించాలని చెప్పారు.


