
గంజాయి కట్టడికి చర్యలు
ఒంగోలు టౌన్: గంజాయి కట్టడి విషయంలో నిర్లక్ష్యం వద్దని, గంజాయి అరికట్టేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశించారు. జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలోని గెలాక్సీ భవనంలో గురువారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. దర్యాప్తులో ఉన్న హత్య, పోక్సో, లైంగిక దాడులు, ఆర్థిక నేరాలు, మిస్సింగ్ కేసులు, రోడ్డు ప్రమాదాలతో పాటుగా పెండింగ్ కేసులు, ఎన్ఫోర్సుమెంట్ విషయాలపై సమీక్షించారు. పోలీస్స్టేషన్ల వారీగా కేసుల నమోదు, నిందితుల అరెస్టు, విచారణకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ గంజాయి వంటి నిషేధిత మాదక ద్రవ్యాల రవాణా, విక్రయాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాల సేవించడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించాలన్నారు. గంజాయి వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్ నేరాలు ఎక్కువైపోతున్న క్రమంలో ప్రజలు సైబర్ నేరాల బారిన పడి నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామస్థాయిలో సైబర్ నేరాలపై అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. చోరీ కేసుల్లో నిందితులను పట్టుకునేందుకు, సొత్తు రికవరీకి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. దొంగతనాలు, దోపీడీలపై గట్టి నిఘా వేయాలని, నైట్ బీట్స్ బలోపేతం చేయాలని, నిత్యం తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
పాత నేరస్తులపై నిఘా
పాత నేరస్తులు, చెడు నలత కలిగిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ సైన్ బోర్డులు, బారికేడ్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. యాక్సిడెంట్కు సంబందిచిన ఎఫ్ఏఆర్, ఐఏఆర్, డీఏఆర్ రిపోర్టులను నిర్ణీత కాలవ్యవధిలో ఎంఏసీటీ కోర్టుకు పంపించాలని, విస్తృతంగా ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించాలన్నారు. పోక్సో కేసులపై కాలేజీలు, పాఠశాలలో అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలని, పిల్లలకు బ్యాడ్ టచ్, గుడ్ టచ్ల గురించి అవగాహన కల్పించాలన్నారు. రానున్న లోక్అదాలత్లో వీలైనంత ఎక్కువ కేసులను రాజీ చేసేందుకు ప్రయత్నించాలని సూచించారు. పోలీసు అధికారులు , సిబ్బంది క్రమశిక్షణతో వ్యవహరించాలని, అంకితభావంతో పనిచేయాలని చెప్పారు. సమర్ధవంతమైన సేవల ద్వారా పోలీసు శాఖకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. నేర సమీక్షలో డీఎస్పీలు నాగరాజు, లక్ష్మీ నారాయణ, రమణ కుమార్, డీసీఆర్బి సీఐ దేవ ప్రభాకర్, ఐటీకోర్ సీఐ సూర్యనారాయణ, ఎస్సీ ఎస్టీ సెల్ సీఐ దుర్గా ప్రసాద్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ ఏఆర్ దామోదర్

గంజాయి కట్టడికి చర్యలు