
అబద్ధాలు చెప్పడం బాబుకు అలవాటు
ఒంగోలు సిటీ: అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకు అలవాటని, ఏడాదిలో ఏం చేయలేని చేతకాని ప్రభుత్వం ఇది అని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి చుండూరి రవిబాబు ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు జనాలను ఉద్ధరించానని చెప్పుకోవడానికి ఒక్క పథకం అయినా ఉందా అని ప్రశ్నించారు. వెలిగొండ ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో చెబితే బాగుండేదన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పొగాకు రైతుల కోసం జిల్లా పర్యటనకు వచ్చి ప్రభుత్వాన్ని నిద్ర లేపారని, దీంతో కేంద్రమంత్రి పీయూష్గోయల్, కేంద్ర మంత్రి కార్యదర్శులు ఒంగోలు పొగాకు బోర్డుకు దిగివచ్చి సమావేశాలు పెట్టి పొగాకు కొనుగోలు చేస్తామని చెప్పారన్నారు. కానీ ఇంత వరకు పొగాకు రైతులకు ఒనగూరిన ప్రయోజనం ఏంలేదన్నారు. లోగ్రేడ్ పొగాకును కేంద్ర ప్రభుత్వం సగం, రాష్ట్ర ప్రభుత్వం సగం వేసుకొని కొనుగోలు చేస్తామని చెప్పారని, కానీ ఇంత వరకు మార్కెట్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. చిన్న చిన్న సంఘటనలను పెద్దవి చేసి డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ప్రజల సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్రెడ్డికి వస్తున్న లక్షలాది ప్రజల ఆదరణ చూసి ఓర్వలేక ఇటువంటి పనులు చేస్తున్నారని విమర్శించారు. ఓ పక్క చంద్రబాబు, పవన్కల్యాణ్లు రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తూ మరో పక్క మాపైనే నిందలు వేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, పవన్కళ్యాణ్ మాట్లాడే భాషలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. గంజాయి విచ్చలవిడిగా రవాణా అవుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. గంజాయి మత్తులో బ్యాచ్ ఒక సీఐపై దాడి చేశారని, ఇళ్ల మీదకు వెళ్లి ఆడపిల్లలపై దాడి చేస్తున్నారని, ఎవ్వరికీ రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. గంజాయి అమ్మినవాడిని పట్టుకుంటే ఎవరు సరఫరా చేస్తున్నారో తెలియదా.. పోలీసులు తలుచుకుంటే ఎంత పని అన్నారు. టీడీపీ వారే గంజాయి వ్యాపారం చేస్తున్నారని, అందుకే పోలీసులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, కొత్తపట్నం మండల అధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి, ఒంగోలు మండల అధ్యక్షుడు మన్నే శ్రీనివాసరావు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, కార్పొరేటర్ ఇమ్రాన్ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జి
చుండూరి రవిబాబు