
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరు
ఒంగోలు టౌన్: కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరక విధానాలపై పోరాటం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ వర్కర్స్ ఫెడరేషన్ గౌరవాధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో గురువారం ఫెడరేషన్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జులై 9వ తేదీన జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి చంద్రబాబు ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానలను అవలంబిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా లొంగిపోయిందని, కార్మికులకు 10 గంటల పనిదినాలను ప్రవేశపెట్టడం దుర్మార్గమన్నారు. మహిళల హక్కులకు భంగం కల్పిస్తూ రాత్రి వేళల్లో డ్యూటీలు వేయడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదని, దీన్ని ప్రజలంతా వ్యతిరేకించాలని కోరారు. బ్రిటీష్ కాలం నుంచి అమలవుతున్న కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ను అమల్లోకి తీసుకురావడం ద్వారా కార్మికుల శ్రమశక్తిని కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయకుండా, ఉద్యోగ భద్రత కల్పించకుండా చేస్తుందని విమర్శించారు. టి. విజయమ్మ, కె. పద్మ, అనిత, సుబ్బరాయుడు, ఆర్.శ్రీనివాసరావు, పోకల కోటేశ్వరరావు పాల్గొన్నారు.