
కోలుకోని ధరలు!
మాటల్లో కొనుగోలు..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ధరల కోసం రైతులు ఆందోళన చేశారు. పొగాకు బేళ్లను దగ్ధం చేసి నిరసనలు తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదిలికి వచ్చి పొగాకు రైతులను పరామర్శించారు. జగన్ పొదిలి పర్యటనకు వచ్చిన స్పందనను చూసి పాలక పక్షం గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. వెంటనే మార్క్ఫెడ్ను రంగంలోకి దింపుతున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. వ్యవసాయశాఖ మంత్రి మార్క్ఫెడ్ కేంద్రాలను ప్రారంభించేశాం రైతులకు మంచి ధర వస్తుందంటూ ప్రకటనలు చేశారు. నాలుగు రోజులుగా రీజియన్ పరిధిలోని 11 వేలం కేంద్రాల్లో అమ్మకాలు జరుగుతున్న తీరును ఒక్కసారి పరిశీలిస్తే ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. కనిష్ట ధరలు రోజు రోజుకూ పతనమవుతున్నాయి. జిల్లాలోని పలు వేలం కేంద్రాల్లో బుధవారం పొగాకు కొనుగోళ్లు కనిష్ట ధర కేవలం రూ.160 వద్ద పలికింది. గరిష్ట ధర ఏదో మొక్కుబడిగా 10–15 బేళ్లకు మాత్రం రూ.280 చూపిస్తున్నారు. దాదాపు 70 శాతం పొగాకు బేళ్లకు కనిష్ట ధరతోనే రైతులు సర్దుకోవాల్సి వచ్చింది. బుధవారం కొనుగోలు చేసిన బేళ్ల వివరాలను పరిశీలిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. నల్లరేగడి నేలలకు సంబంధించిన వేలం కేంద్రాలు వెల్లంపల్లి–2, ఒంగోలు–1, 2, టంగుటూరు–1, కొండపికి మొత్తం 5,452 బేళ్లు రాగా వాటిలో నోబిడ్ పేరుతో 1558 బేళ్లను తిరస్కరించారు. కొనుగోలు చేసిన బేళ్లకు కనిష్ట ధర రూ.160, గరిష్ట ధర రూ.280 పలికింది. సరాసరి ధర రూ.233.24 పలికింది. అదే విధంగా తేలికరకం నేలలు కలిగిన వేలం కేంద్రాలైన పొదిలి–1, కనిగిరి, కందుకూరు–1,2, కలిగిరి, డీసీపల్లిలో 5,394 బేళ్లు రాగా వాటిలో 1437 బేళ్లను తిరస్కరించారు. మిగిలిన బేళ్లకు కనిష్ట ధర రూ.160, గరిష్ట ధర రూ.280, సరాసరి ధర రూ.232.08 పలికింది.
6 రౌండ్లు పూర్తయినా లభించని గిట్టుబాటు ధర
కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం ఆరో రౌండ్ పొగాకు కొనుగోళ్లు పూర్తయ్యాయి. గురువారం నుంచి 7వ రౌండ్ కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. ఇప్పటి వరకు వేలం కేంద్రంలో 6.24 మిలియన్ కేజీల పొగాకు అమ్మకాలు జరిగాయి. ఇప్పటికీ రైతులకు గిట్టుబాటు ధర లభించక కూలీలకు, కౌలు ఇంత వరకు నగదు చెల్లించలేదని రైతులు వాపోతున్నారు. రైతుల దగ్గర ఉన్న లో గ్రేడు పొగాకును రూ.180 నుంచి రూ.160కి తగ్గించిన వ్యాపారులు ఆ ధరకు కూడా నామమాత్రంగా బేళ్లను కొనుగోలు చేసి ఎక్కువ భాగం తిప్పి పంపుతున్నారు.
ఒకే రోజు పొగాకు కేజీకి రూ.20 తగ్గింపు
టంగుటూరు: పొగాకు వేలం కేంద్రంలో ఒకే రోజు కనిష్ట ధర రూ.20 తగ్గించి కేజీ రూ.160కి వ్యాపారులు కొనుగోలు చేశారు. దీంతో రైతులు విస్మయం వ్యక్తం చేశారు. అసలే ఈ ఏడాది నష్టాలు పాలవుతున్నామని, దీనికి తోడు రోజు రోజుకీ ధరలు దిగజారుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొగాకు వేలం కేంద్రంలో బుధవారం నిర్వహించిన వేలంలో 205 పొగాకు బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ వేలంలో మొత్తం 25 మంది వ్యాపారులు పాల్గొన్నారని వేలం నిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు.
పడిపోతున్న పొగాకు కనిష్ట ధరలు మార్క్ఫెడ్ను రంగంలోకి దించామంటూ హడావుడి ధరల పెరుగుదలలో కానరాని మార్పు కేజీ పొగాకు కనిష్ట ధర రూ.160 కి పతనం పెరుగుతున్న తిరస్కరణకు గురవుతున్న బేళ్ల సంఖ్య బుధవారం ఒక్కరోజే 3 వేల బేళ్లు వెనక్కి ఆత్మహత్యలే శరణ్యమంటున్న రైతులు నాలుగు నెలలు దాటుతున్నా 52 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోళ్లు
పెరుగుతున్న రిటన్ బేళ్ల సంఖ్య..
పొదిలి వేలం కేంద్రంలో రోజు రోజుకూ రిటన్ బేళ్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక వైపు ధరలు లేక రైతులు దిగాలు పడుతుండగా మరో వైపు రిటన్ బేళ్లతో మరింత గుబులు పడుతున్నారు. బుధవారం వేలానికి 1197 బేళ్లు వచ్చాయి. వాటిలో 620 మాత్రమే కంపెనీల వారు కొనుగోలు చేశారు. పలు కారణాలతో 580 తిరస్కరణకు గురయ్యాయి. వీటిలో 499 బేళ్లు నోబిడ్గా తిరస్కరించారు. 20 కంపెనీల ప్రతినిధులు వేలంలో పాల్గొన్నారు. కనిగిరి బోర్డులో బుధవారం సీతారంపురం (తురకపల్లి) క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతులు 705 బేళ్లను యార్డుకు తెచ్చారు. అందులో 365 బేళ్లు కొనుగోలు చేయగా, 340 పొగాకు బేళ్లను తిరస్కరించారు. ఈ కేంద్రం పరిధిలో ఇప్పటి వరకూ 3.1 మిలియన్ కేజీల పొగాకును మాత్రమే కొనుగోలు చేశారు. కొండపి వేలం కేంద్రానికి వెన్నూరు చిన్న వెంకన్నపాలెం గ్రామాలకు చెందిన రైతులు 965 బేళ్లను వేలానికి తీసుకొచ్చారు. అందులో 687 బేళ్లు కొనుగోలయ్యాయి. 278 బేళ్లను తిరస్కరించారు. వేలంలో 24 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే టంగుటూరు కేంద్రానికి వేలం కేంద్రానికి దావగూడూరు, చింతలపాలెం గ్రామాలకి చెందిన రైతులు వేలానికి 895 బేళ్లను వేలానికి తీసుకురాగా వాటిలో 690 కొనుగోలు చేశారు. 205 పొగాకు బేళ్లు తిరస్కరించారు.

కోలుకోని ధరలు!