
వీఆర్ఏలపై అదనపు భారం తగదు
ఒంగోలు టౌన్: వీఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అదనపు భారంతో అల్లాడిస్తోందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గెంటెనపల్లి శ్రీనివాసులు విమర్శించారు. గ్రామ రెవెన్యూ సహాయకులకు తెలంగాణ తరహాలో టైం స్కేలు జీతాలు, డీఏని కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు వీఆర్ఏ సంఘం జిల్లా నాయకురాలు పి.జ్యోతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గంటెనపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చాక వీఆర్ఏలకు టైం స్కేలు జీతాలు, ప్రమోషన్స్, డీఏని జీతంతో కలపడం లాంటివి చేయకుండా అదనపు భారంతో వేధిస్తోందని మండిపడ్డారు. ఇసుక ర్యాంపులు, రైస్ మిల్లుల వద్ద డ్యూటీలు, సర్వే డ్యూటీలు వంటి అదనపు భారం వేయడంతో ఉద్యోగులు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు భారం వేసినా టీఏలు, డీఏలు చెల్లించకపోవడం దారుణమన్నారు. లేబర్ కోడ్స్ మొత్తాన్ని రద్దు చేయాలని, వీఆర్ఏలకు నైట్ డ్యూటీలు రద్దు చేయాలని, నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలని, పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. అనంతరం కలెక్టర్కు కలిసి వినతి పత్రం అందజేశారు. జులై 9వ తేదీ జరిగే సమ్మెలో పాల్గొంటామని తెలిపారు. ఈ ధర్నాలో దానం, వి.యేసు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
చలో తెనాలిని జయప్రదం చేయండి
ఒంగోలు టౌన్: దళిత మైనారిటీ యువకుల మీద పోలీసుల అరాచకాన్ని ఖండిస్తూ ఈ నెల 28వ తేదీ తెనాలిలో నిర్వహించనున్న మానవ హక్కుల పరిరక్షణ సదస్సును జయప్రదం చేయాలని ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మంచి పుస్తకం వద్ద బుధవారం శ్రీచలో తెనాలిశ్రీ కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం సుధాకర్ మాట్లాడుతూ తెనాలిలో నడిరోడ్డు మీద దళిత మైనారిటీ యువకులను పోలీసులు చిత్రహింసలు పెట్టడం ముమ్మాటికీ మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని స్పష్టం చేశారు. రాజ్యాంగ హక్కులు, చట్టాలను తుంగలో తొక్కి దళిత మైనారిటీ యువకులపై బహిరంగ ప్రదేశంలో దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాజంలో మానవ హక్కులు కాపాడుకోవాలని కోరారు. పోలీసు చర్యలను మంత్రులు సమర్ధిస్తూ మాట్లాడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. పోలీసుల బహిరంగ దాడిని సమర్దించిన హోం మంత్రి వంగలపూడి అనిత, ఎస్పీ సతీష్ కుమార్లపై జాతీయ మానవ హక్కుల వేదిక తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించాలన్నారు. చలో తెనాలి కార్యక్రమాన్ని హక్కుల సంఘాలు, దళిత మైనారిటీ సంఘాలు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు భీమవరపు సుబ్బారావు, పెద్దన్న, తన్నీరు వెంకటస్వామి, పిన్నిక శ్రీనివాస్, ఆనాల వెంకటరావు, ఆంజనేయులు, గాలి సంగీతరావు, దాసి సుందరం, కె.పేరయ్య, టి.వెంకటస్వామి ,లింగ వెంకటేశ్వర్లు , నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.
29న జాబ్మేళా
మార్కాపురం టౌన్: ఈనెల 29వ తేదీన ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో 10 బహుళజాతి కంపెనీలతో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి రవితేజ యాదవ్ బుధవారం తెలిపారు. మార్కాపురం నియోజకవర్గంతోపాటు జిల్లాలోని 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న పదో తరగతి నుంచి పీజీ వరకూ చదువుకుని ఖాళీగా ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు ఎస్కే ఫిరోజ్గాంధీ 70139 50097 నంబరును సంప్రదించాలన్నారు.
జూలై 9న దేశ వ్యాప్త సమ్మె
ఒంగోలు సబర్బన్: కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మార్చిన లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జూలై 9వ తేదీన మున్సిపల్ ఇంజినీరింగ్, శానిటేషన్ విభాగాల్లో పని చేస్తున్న కార్మికులు సమ్మె చేస్తున్నట్లు సీఐటీయూ నాయకులు ప్రకటించారు. ఈ మేరకు ఏ.పీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఒంగోలు నగర్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ కె. వెంకటేశ్వరరావుకు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఒంగోలు నగర్ కార్యదర్శి టి.మహేష్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని తదితర డిమాండ్ల పరిష్కారానికి సమ్మె చేస్తున్నట్లు చెప్పారు. ఇంజినీరింగ్ కార్మికులు జీవో నంబర్ 36 ప్రకారం జీతాలు పెంచాలని మున్సిపల్ కార్మికులందరికీ షరతులు లేకుండా తల్లికి వందనం పథకంతో సహా అన్ని ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంజినీరింగ్, ఎన్ఎంఆర్, ఎం.ఆర్ బదిలీ కోవిడ్, క్లబ్ డ్రైవర్కు జీవో నంబర్ 36 ప్రకారం జీతాలు చెల్లించాలన్నారు. డెత్, సిక్, ఆప్కాస్ ద్వారా రిటైర్మెంట్ చేసిన కార్మికుల పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలని, వయోపరిమితి 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు జి. నరసింహ, టి.విజయమ్మ, నాయకులు కె.సామ్రాజ్యం, ఆర్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

వీఆర్ఏలపై అదనపు భారం తగదు