మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించాలి | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించాలి

Jun 26 2025 6:14 AM | Updated on Jun 26 2025 6:14 AM

మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించాలి

మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించాలి

కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా

ఒంగోలు సబర్బన్‌: మాదకద్రవ్య రహిత సమాజాన్ని సాధించేందుకు అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలని కలెక్టర్‌ ఏ.తమీమ్‌ అన్సారియా పిలుపునిచ్చారు. ఈ దిశగా విస్తృత అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ నెల 26వ తేదీ అంతర్జాతీయ మాదకద్రవ్య రహిత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టే కార్యక్రమ నిర్వహణపై ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌తో కలిసి బుధవారం ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గురువారం గుంటూరులో నిర్వహించే రాష్ట్రస్థాయి అవగాహన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నట్లు తెలిపారు. దీనికి అనుబంధంగా అన్ని జిల్లాల్లోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినందున జిల్లా కేంద్రం ఒంగోలులో గురువారం మధ్యాహ్నం నుంచి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని, అనంతరం అక్కడి నుంచి అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌ వరకు ప్రత్యేక ర్యాలీ ఉంటుందని వివరించారు. విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ఆశా వర్కర్లు, ఇతర ఉద్యోగులు, అంగన్‌వాడీ సిబ్బంది, వివిధ వర్గాల ప్రజలను ర్యాలీలో భాగస్వాములను చేయాలని కలెక్టర్‌ చెప్పారు. ఈ దిశగా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ర్యాలీలో పాల్గొనే వారికి అవసరమైన ముందస్తు వైద్య సాయం అందించేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ మాట్లాడుతూ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అందుకోసం చేయాల్సిన ఏర్పాట్లపై పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మధ్యాహ్నం నుంచి ఈ కార్యక్రమం ఉంటుందని, నగరంలో ప్రత్యేక ట్రాఫిక్‌ ఆంక్షలు విధించాల్సి ఉంటుందన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్‌ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే పదార్థాలను వివరించేలా రూపొందించిన పోస్టర్లను, నిషా ముఖ్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన ప్రత్యేక క్యూఆర్‌ కోడ్‌ను కలెక్టర్‌, ఎస్పీ, ఇతర అధికారులు ఆవిష్కరించారు. క్యుఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి పేరు, ఇతర వివరాలు నమోదు చేస్తే డ్రగ్స్‌ వినియోగ వ్యతిరేక ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సర్టిఫికెట్‌ జనరేట్‌ అవుతుందన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ బి.చిన ఓబులేసు, ఐసీడీఎస్‌ పీడీ సువర్ణ, మెప్మా పీడీ శ్రీహరి, డీఆర్డీఏ పీడీ నారాయణ, ఎకై ్సజ్‌ ఎస్‌ఈ ఆయేషా బేగం, దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు సువార్త, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్‌, బీసీ సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి, స్టెప్‌ సీఈఓ శ్రీమన్నారాయణ, డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్లు, డీటీసీ సుశీల, దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌ కళ్యాణి, డీఈవో కిరణ్‌కుమార్‌, ఒంగోలు మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వరరావు, డీసీపీఓ దినేష్‌కుమార్‌, ఒంగోలు డీఎస్పీ ఆర్‌.శ్రీనివాసరావు, మహిళా పీఎస్‌ డీఎస్పీ రమణ కుమార్‌, ఏఆర్‌ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, పలువురు సీఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement