
సీతారామలక్ష్మణులను ఎత్తుకెళ్లారు హనుమంతుడిని వదిలేశారు!
కంభం:
రామాలయంలో దొంగలు పడి పంచలోహ విగ్రహాలను అపహరించిన ఘటన కంభం మండలంలోని తెల్లదిన్నె గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. తెల్లదిన్నె గ్రామంలోని రామాలయంలో సోమవారం సాయంత్రం దీపారాధన నిర్వహించి గుడి తలుపులు మూశారు. మంగళవారం ఉదయం తాళం పగలగొట్టి ఉండటంతో స్థానికులు లోపలికి వెళ్లి చూడగా సీతా రామ లక్ష్మణుల పంచలోహ విగ్రహాలు కనపడలేదు. కేవలం హనుమంతుడి విగ్రహం మాత్రమే అక్కడ ఉంది. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని కంభం సీఐ మల్లికార్జున, ఎస్సై నరసింహారావు పరిశీలించి వివరాలు సేకరించారు. మార్కాపురం క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించారు.
హనుమంతుడిని ఎందుకొదిలేసినట్టు?
తెల్లదిన్నెలో రామాలయాన్ని 91 ఏళ్ల క్రితం నిర్మించారు. గ్రామానికి చెందిన చీరెళ్ల కోటమ్మ పంచలోహాలతో సీతారామలక్ష్మణుల విగ్రహాలు తయారు చేయించి ప్రతిష్ఠించారని స్థానికులు చెబుతున్నారు. చోరీకి వచ్చిన వారు ఆంజనేయ స్వామి ప్రతిమను వదిలేసి మిగిలిన మూడు విగ్రహాలు తీసుకెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయంపై పూర్తి అవగాహన ఉన్నవారే దోపిడీకి తెగబడి ఉంటారన్న చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా దొంగలు వదిలేసిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మార్కాపురంలోని పురావస్తు ల్యాబ్లో తనిఖీ చేయించగా అది ఇత్తడితో చేసినట్లు తేలిందని ఎస్సై తెలిపారు. అపహరణకు గురైన విగ్రహాలు ఇత్తడివా లేక పంచలోహాలతో చేసినవా అనేది దొంగలు దొరికితేనే తేలనుంది.
పురాతన రామాలయంలో మూడు పంచలోహ విగ్రహాలు చోరీ!
కంభం మండలం తెల్లదిన్నె గ్రామంలో దుండగుల దుశ్చర్య
హనుమంతుడి విగ్రహం ఇత్తడిదని పురావస్తు ల్యాబ్ నివేదిక

సీతారామలక్ష్మణులను ఎత్తుకెళ్లారు హనుమంతుడిని వదిలేశారు!