
ఇప్పటికైనా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
● ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తోందని, రాబోయో సంవత్సర కాలంలోనైనా పాత్రికేయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి కోరారు. ఒంగోలు దక్షిణ బైపాస్లోని విష్ణుప్రియ కన్వెన్షన్ హాలులో బుధవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (ఏపీయూడబ్ల్యూజే) 36వ రాష్ట్ర మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పాత్రికేయుల వేతన సవరణ చట్టం ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వేతన సవరణ జరిగి 15 ఏళ్లు అవుతోందని, దీనిపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని కోరారు. సభకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరయ్యారు. తొలుత ప్రకాశం భవన్ నుంచి విష్టుప్రియ కన్వెన్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయస్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఐజేయూ జనరల్ సెక్రటరీ బల్వీందర్ సింగ్ జమ్ము, స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎస్ఎన్ సిన్హా, జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్, నాయకులు సుబ్బారావు పాల్గొన్నారు.