
కాంప్లెక్స్ కట్టేసి!
మరుగుదొడ్లు మింగేసి..
తర్లుపాడు: ప్రభుత్వ భూములకు కస్టోడియన్లుగా వ్యవహరించాల్సిన అధికారులు.. ఓ వైపు భూములు కబ్జా అవుతున్నా చేష్టలుడిగి చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్రమణకు గురైన భూమిని డీఎల్పీఓ సైతం పరిశీలించినప్పటికీ చర్యలకు వెనుకాడుతున్న తీరు చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రమైన తర్లుపాడులో వేణుగోపాలస్వామి దేవస్థానం సమీపంలోని గ్రామ కంఠం భూమిలో సుమారు 40 ఏళ్ల క్రితం పంచాయతీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ మరుగుదొడ్లు నిర్మించారు. కాలక్రమేనా అవి నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటి చుట్టూ వివిధ ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో భూమి ధర లక్షల రూపాయలు పలుకుతోంది. దీంతో ఆ స్థలం తమ బంధువులదే అంటూ మార్కాపురంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఓ అధికారి రంగంలోకి దిగాడు. సుమారు రూ.50 లక్షలకు పైగా విలువ చేసే స్థలాన్ని దక్కించుకునేందుకు పావులు కదిపాడు. ఇటీవలే రాత్రికి రాత్రి కమ్యూనిటీ బాత్రూములు కూల్చివేసి వెంటనే నిర్మాణాలు ప్రారంభించాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అభ్యంతరం తెలపడంతో పంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులను ఏమాత్రం పట్టించుకోని సదరు విద్యుత్ శాఖ అధికారి.. కూటమి పార్టీ నియోజకవర్గ ముఖ్యనేత పేరు చెప్పి స్థానిక అధికారుల నోర్లు మూయించాడు. దీనికి తోడు కొందరు అధికారులకు భారీ ఎత్తున లంచాలు ముట్టజెప్పారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని సాక్షాత్తూ మార్కాపురం డీఎల్పీఓ పరిశీలించి కూడా మిన్నకుండిపోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
జనరల్ బాడీ సమావేశంలో..
గత నెలలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ పలువురు ప్రజా ప్రతినిధులు సభ దృష్టికి తీసుకొచ్చారు. మండల కేంద్రం కావడంతో బ్యాంకులు వెలుగు, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో అనేక పనుల నిమిత్తం నిత్యం పదుల సంఖ్యలో మహిళలు తర్లుపాడుకు వస్తుంటారని, వారు వినియో గించుకనేందుకు కూడా టాయిలెట్లు లేవని సమావేశంలో అధికారులకు వివరించారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అధికార పార్టీ నేతల సహకారం
విలువైన ప్రభుత్వ స్థలం విద్యుత్ శాఖ అధికారికి కట్టబెట్టేందుకు స్థానిక అధికార పార్టీ నేతలు కొందరు పూర్తి సహకారం అందించినట్లు గ్రామంలో జోరుగా చర్చ నడుస్తోంది. గ్రామంలో భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడాల్సిన ప్రభుత్వ స్థలం కూటమి ప్రభుత్వంలో పరులపాలు కావడంపై గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖలో అత్యంత అవినీతిపరుడుగా పేరున్న ఆ అధికారికి గ్రామ స్థాయి అధికార పార్టీ నాయకులు సహకరించడంతో ఆ పార్టీలోని కొందరు బీసీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఉన్నతాధికారులు, కలెక్టర్ జోక్యం చేసుకుని విలువైన ప్రభుత్వస్ధలం అక్రమార్కుడి నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తర్లుపాడులో ప్రభుత్వ స్థలం కబ్జా చేసిన విద్యుత్ శాఖ అధికారి
ఆక్రమిత భూమి విలువ రూ.50 లక్షలకు పైమాటే..
యథేచ్ఛగా అక్రమ నిర్మాణం చేపడుతున్నా స్పందించని అధికారులు
రెవెన్యూ, పంచాయతీ అధికారుల తీరుపై విమర్శల వెల్లువ

కాంప్లెక్స్ కట్టేసి!