
నేరేడుతో ఆరోగ్యం.. ఆదాయం!
● గతంలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి పండ్లు దిగుమతి
● నేడు పశ్చిమ ప్రకాశంలో 250 ఎకరాల్లో నేరేడు పండిస్తున్న రైతులు
● రైతు వద్ద కిలో రూ.100, మార్కెట్లో ధర రూ.200–రూ.250
బేస్తవారిపేట: పశ్చిమ ప్రకాశంలో వర్షాభావ పరిస్థితులు ఉండటంతో పాటు ఖర్చు తక్కువ కావడంతో కొందరు రైతులు నేరేడు పంట సాగు వైపు మొగ్గుచూపుతున్నారు. చీడపీడలు ఆశించే అవకాశం తక్కువగా ఉండటంతో పురుగు మందుల పిచికారీ భారం తప్పుతోందని రైతులు చెబుతున్నారు. డయాబెటిక్(సుగర్) బాధితుల సంఖ్య ఎక్కువ అవుతుండటంతో మార్కెట్లో నేరేడు పండ్లకు మంచి డిమాండ్ ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుతోపాటు మన రాష్ట్రంలోని రాయచోటి, అనంతపురం జిల్లాల నుంచి నేరుడు పండ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే పశ్చిమ ప్రాంతంలో కొందరు రైతులు నేరుడు పంటపై అవగాహన పెంపొందించుకుని దాదాపు 250 ఎకరాల్లో పంట సాగు మొదలు పెట్టారు. గిద్దలూరు నియోజకవర్గంలో 45 ఎకరాల్లో నేరేడు తోటలు సాగు చేశారు. రైతుల వద్ద నేరేడు పండ్లు కిలో రూ.100 పలుకుతుండగా, మార్కెట్లో మాత్రం రూ.200–రూ.250 ధరకు విక్రయిస్తున్నారు.
ఆరోగ్యానికి దివ్యౌషధం
నేరేడు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మధుమేహంతో పాటు అనేక శారీరక రుగ్మతలను నేరేడు పండు దూరం చేస్తుంది. ప్రతి 100 గ్రాముల నేరేడు పండ్లలో ప్రొటీన్స్ 0.07 శాతం, కొవ్వులు 0.3, ఖనిజాలు 0.04, పీచు 0.9 శాతం, అలాగే పిండి పదార్థాలు 15 మిల్లీగ్రాములు, ఫాస్పరస్ 15 మి.గ్రా, ఐరన్ 1.2 మి.గ్రా, విటమిన్ సీ 18 మి.గ్రా, పొటాషియం 55 మి.గ్రా ఉంటాయి. నేరేడులో ఉండే ఆమ్లగుణం వల్ల దీన్ని జామ్లు, వెనిగర్, సాండీస్, ఆల్కహాల్ తక్కువ శాతం ఉండే వైన్ తయారీలోనూ వినియోగిస్తారు.
5 ఎకరాలకు సబ్సిడీ
నేరేడు పంట సాగు చేయాలనుకునే రైతులకు హెక్టార్కు దాదాపు రూ.30 వేల చొప్పున రాయితీ వస్తుంది. ఒక్కో రైతు రెండు హెక్టార్ల వరకు సబ్సిడీ పొందవచ్చు. బహదోలి, బోడ, చింతామణి రకాలు అధిక దిగుబడులను ఇస్తాయి. రైతులు షోలాపూర్ నుంచి మొక్కలు తెచ్చుకుంటున్నారు. మార్కెట్లో నేరేడు పండ్లకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడిప్పుడే రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
–డి.శ్వేత, ఉద్యానవన శాఖ అధికారి

నేరేడుతో ఆరోగ్యం.. ఆదాయం!