
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
మద్దిపాడు: మండలంలోని గుండ్లాపల్లి వద్ద మల్లవరం రిజర్వాయర్ ఎడమ కాలువ పక్కన గుర్తు తెలియని పురుషుని మృతదేహం లభించింది. జాతీయ రహదారికి 200 మీటర్ల దూరంలో ఎడమ కాలువ గట్టున మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 40 నుంచి 50 ఏళ్ల వయసు మధ్య ఉన్న వ్యక్తిదిగా గుర్తించారు. చనిపోయి వారం రోజులు అయి ఉండవచ్చని, ముఖమంతా చీమలు కుట్టడంతో ముఖం వాచిపోయిందని తెలిపారు. శవంపై ఎటువంటి దుస్తులు లేవని అన్నారు. ఎవరైనా ఇటీవల 40 నుంచి 50 సంవత్సరాల్లోపు వ్యక్తి తప్పిపోయి ఉంటే వారు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ ఒక ప్రకటనలో తెలిపారు.
తప్పుడు కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారు
● చిన్నగుడిపాడు సర్పంచ్ మల్లికార్జున
పెద్దదోర్నాల: కూటమి నాయకులు తనపై తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారని మండల పరిధిలోని చిన్నగుడిపాడు సర్పంచ్ వల్లభనేని మల్లికార్జున ఆదివారం వాపోయారు. గ్రామంలో నీటి సమస్య తీర్చాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. దానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కూటమి నాయకులు తన వారిపైనే దాడికి పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా కూటమి నాయకులు తనపై తప్పుడు కేసులు బనాయించారని ఆయన పేర్కొన్నారు. కేసులో భాగంగా వల్లభనేని మల్లికార్జునను ఆదివారం అరెస్ట్ చేసి మార్కాపురం కోర్టుకు తరలించారు.
జాతీయ స్థాయి కబడ్డీ పోటీకి పాకల విద్యార్థినులు
సింగరాయకొండ: జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఇద్దరు పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఎంపికై నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు పిల్లి హజరత్తయ్య తెలిపారు. ఇటీవల కాకినాడలో జరిగిన ఎంపికల్లో కే సిపోరా, కే త్రిగుణ ఎంపికయ్యారన్నారు. వీరు ఈనెల 28వ తేదీ నుంచి ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ లో జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని ఆయన వివరించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థినులను అభినందించారు.
ఒంగోలులో ఉపాధ్యాయుల నిరసన
ఒంగోలు టౌన్:
జిల్లా వ్యాప్తంగా ఉన్న 233 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను ఒంగోలు నగరంలోని డీఆర్ఆర్ఎం హైస్కూల్లో ఆదివారం చేపట్టారు. రెగ్యులర్ ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ముగిసిన తరువాత ఖాళీగా ఉన్న కేటగిరీ4లోని మారుమూల గ్రామీణ పాఠశాలలను ఎంటీఎస్ ఉపాధ్యాయులకు కేటాయిస్తుండడంతో అసంతృప్తికి గురయ్యారు. దాంతో వారు నిరసనలకు దిగారు. సుమారు నాలుగు గంటలపాటు నిరసన చేపట్టారు. ఎంటీఎస్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. పాఠశాలలోనే కాకుండా కాంప్లెక్స్ పరిధిలో కూడా తమకు పోస్టింగులు ఇవ్వాలని ఎంటీఎస్ ఉపాధ్యాయలు పట్టుబట్టారు. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించాల్సిన బదిలీ ప్రక్రియ ఉపాధ్యాయుల నిరసనతో నిలిచిపోయింది. దీంతో సుమారు 4.30 గంటల పాటు బదిలీల ప్రక్రియ నిలిచిపోయింది. కాసేపటి తరువాత ఎంపీటీసీ ఉపాధ్యాయులు బుజ్జగించిన అధికారులు రాత్రి 7 గంటల తరువాత బదిలీల ప్రక్రియను మొదలు పెట్టారు. మొత్తం ఉపాధ్యాయలు బదిలీ ప్రక్రియ రాత్రి పూటనే జరగడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.