భవిష్యత్‌కు గ్యారెంటీ.. బాబు మార్కు గారడీ | - | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌కు గ్యారెంటీ.. బాబు మార్కు గారడీ

Jun 23 2025 5:34 AM | Updated on Jun 23 2025 5:34 AM

భవిష్యత్‌కు గ్యారెంటీ.. బాబు మార్కు గారడీ

భవిష్యత్‌కు గ్యారెంటీ.. బాబు మార్కు గారడీ

మార్టూరు: ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ’ అంటూ ఎన్నికలకు ముందు చంద్రబాబు అండ్‌ కో చేసిన గారడీని నమ్మి ఓటేసిన ప్రజలు, యువతను నిలువునా ముంచారని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకుడు, ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రిని నేటి ‘యువత పోరు’లో నిలదీద్దామని పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం మార్టూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బత్తుల మాట్లాడారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో గ్రామ/వార్డు సచివాలయాలు, ఆరోగ్య విభాగం, ఇతర ప్రభుత్వ శాఖల్లో కొత్తగా 2.50 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు ఉన్నవారిని సైతం ఊడబీకి పొట్టకొడుతున్నారని నిప్పులు చెరిగారు. ఏటా ఐదు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, అప్పటి వరకు రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు అందిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆడబిడ్డ నిధి పేరుతో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు, అన్నదాతకు పెట్టుబడి నిధి కింద ఏటా రూ.20 వేలు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని నిలదీశారు. 50 ఏళ్లు నిండిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నెలకు రూ.4 వేల చొప్పున పెన్షన్‌ ఇస్తామన్న హామీని సీఎం చంద్రబాబు, కూటమి నాయకులు మరిచిపోయి ఉండవచ్చు కానీ ఆయా వర్గాల ప్రజలు మరువలేదన్నారు.

తల్లికి వందనం లోపభూయిష్టం

సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఒకటైన తల్లికి వందనం పథకాన్ని ఏడాది ఆలస్యంగా, అది కూడా లోపభూయిష్టంగా అమలు చేశారని బత్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హుల పేర్లు జాబితాలో ఎగరగొట్టి మోసం చేశారని మండిపడ్డారు. గత ఏడాది కాలంగా రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారని, పెట్టుబడి సాయం రూ.20 వేలు ఇచ్చి ఉంటే రైతులకు కాస్తయినా ఉపశమనం కలిగి ఉండేదని అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వంతో సంక్షేమ ఫలాలు అందిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ మౌనం పాటించడం వెనుక మర్మమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలకు కట్టుబడటమే కాక ఇవ్వని హామీలను సైతం నెరవేర్చారు కాబట్టే మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను గుర్తు చేసుకుని ప్రజలు నీరాజనం పడుతున్నారన్నారు. అనంతరం టీడీపీ బూత్‌ కమిటీ అధ్యక్షుల ద్వారా గత ఎన్నికల వేళ చంద్రబాబు ఇంటింటికీ పంపిణీ చేయించిన ష్యూరిటీ బాండ్లను ప్రదర్శించారు.

చంద్రబాబుకు జాబ్‌ ఇస్తే ఆయన యువతకు చేయిచ్చారు

ఏడాదైనా ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి ఊసేలేదు

నేటి యువత పోరును విజయవంతం చేద్దాం

వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి పిలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement