
మూఢనమ్మకాల నిర్మూలనే జేవీవీ లక్ష్యం
● జేవీవీ జాతీయ గౌరవాధ్యక్షుడు డాక్టర్ కే.నాగేశ్వరరావు
పామూరు: మూఢ నమ్మకాల నిర్మూలనే జనవిజ్ఞాన వేదిక లక్ష్యమని, యువత మూఢనమ్మకాలకు దూరంగా ఉండి శాసీ్త్రయ దృక్పథం వైపు ఆలోచించాలని జేవీవీ జాతీయ గౌరవాధ్యక్షుడు డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు అన్నారు. జేవీవీ ప్రకాశం జిల్లా 18వ మహాసభలు ఆదివారం పామూరు మమూరి ఫంక్షన్ హాలులో షేక్.నాయబ్రసూల్ అధ్యక్షతన నిర్వహించారు. మహాసభల సందర్భంగా జాతీయ జెండాను ఎస్సై టి.కిషోర్బాబు ఆవిష్కరించారు. మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన జేవీవీ జాతీయ గౌరవాధ్యక్షుడు డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు మాట్లాడుతూ సైన్స్, టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా మూఢనమ్మకాలు మాత్రం తగ్గడంలేద న్నారన్నారు. సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రజల్లో శాసీ్త్రయ దృక్పథం పెరగాలన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ను పూర్తిచేసి ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించాలని, పరిశ్రమలు ఏర్పాటుచేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, యూనివర్సిటీలో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీచేయడంతోపాటు నిధులు మంజూరు చేయాలని తీర్మానాలు ప్రవేశపెట్టారు. మహాసభల్లో ప్రదర్శించిన మేజిక్ ఆహూతులను అలరించింది. జేవీవీ జాతీయ సలహాదారుడు మియా పాటలు ఆలోచింపజేశాయి. అనంతరం 15 మందితో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జేవీవీ జాతీయ ఉపాధ్యక్షుడు షేక్.గయాజ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే.శ్రీనివాసులు, జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొల్లా మధు, జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంజూరుబాష, జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల వెంకటేశ్వర్లు, జిల్లా గౌరవాధ్యక్షుడు జేసీహెచ్ వెంకటేశ్వర్లు, సుజాత, స్వయంకృషి స్వచ్ఛంద సేవాసంస్థ అధ్యక్షుడు డాక్టర్ నాయబ్రసూల్, మానవత సేవాసంస్థ అధ్యక్షుడు వి.వెంకటేశ్వరరెడ్డి, జే.గోవిందయ్య, టి.వెంకటేశ్వర్లు, పోలేపల్లి సిద్దయ్య, కొమ్మరెడ్డి కొండమ్మ, ధనుంజయ, మీనా, మధు, ఫణి, డాక్టర్ కేటీసీ పాపారాయుడు, సభ్యులు పాల్గొన్నారు.