డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తో ఒరిగిందేంటి ? | - | Sakshi
Sakshi News home page

డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తో ఒరిగిందేంటి ?

Jun 22 2025 3:26 AM | Updated on Jun 22 2025 3:26 AM

డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తో ఒరిగిందేంటి ?

డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తో ఒరిగిందేంటి ?

దర్శి(కురిచేడు): కూటమి ప్రభుత్వం అప్పులు తీసుకురావటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలను శోధిస్తోందని అమరావతి రాజధాని పేరుతో రూ.31 వేల కోట్లు అప్పులు తెచ్చారని, మరో రూ.31 వేల కోట్లు అప్పులు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని డబుల్‌ ఇంజన్‌ సర్కార్తో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ విమర్శించారు. సీపీఐ జిల్లా 17వ మహాసభలు దర్శిలోని సానికొమ్ము కాశిరెడ్డి సభా ప్రాంగణంలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సీపీఐ సీనియర్‌ నాయకులు అందె నాసరయ్య జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ మాట్లాడుతూ బీజేపీ పాలనలో దేశంలో ఏ సమస్య పరిష్కారం అయిందో ప్రధాని మోదీ చెప్పాలని ప్రశ్నించారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గలేదని, నిరుద్యోగం రోజురోజుకూ పెరుగుతోందని, రైతులకు గిట్టుబాటు ధరలు దక్కటంలేదన్నారు. నేటికీ దేశంలో 14 కోట్ల మందికి రోజువారీ ఆదాయం రూ.50 – రూ.100లోపే ఉంటుందని పేర్కొన్నారు. ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు వడ్డీ సంస్థలు దేశంలో పేదరికం తగ్గిందని చెప్పటం దుర్మార్గమన్నారు. కార్పొరేట్‌ ఆస్తులు గణనీయంగా పెరిగాయన్నారు. వ్యవసాయ ఆధారిత దేశమైన భారతదేశంలో 55 శాతం మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు తమ పాలన సుస్థిరం చేసుకునేందుకు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారన్నారు. జగన్‌ పాలనలో అదాని స్మార్ట్‌ మీటర్‌ వద్దన్న టీడీపీ నాయకులు నేడు అవే ముద్దంటూ ఎందుకు పేర్కొంటున్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు. వెలుగొండ ప్రాజెక్టు వంటి చిన్న ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టకుండా పోలవరం, బనకచర్ల వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణం వైపే చంద్రబాబు మొగ్గుచూపటం ఎవరిప్రయోజనాల కోసం అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు పరిశ్రమలు నిర్వీర్యం చేసి దాని స్థానంలో మిట్టల్‌ ప్రైవేటు ఉక్కు పరిశ్రమకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు మోదీకి ఈవెంట్‌ మేనేజర్‌ గా పనిచేస్తున్నారన్నారు. యోగాను దేశమంతా జరుపుకుంటుండగా కేవలం విశాఖపట్నంలో నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమానికి నెలరోజులుగా ప్రభుత్వం, అధికారులు, ప్రజా ప్రతినిదులు నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారన్నారు. యోగాంధ్ర వలన ప్రజా సమస్యలు తీరవని విమర్శించారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రజాసమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. అధికారంలో లేకుండా ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు చేస్తూ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకై క పార్టీ సీపీఐ మాత్రమేనని రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ జిల్లాలో అధికారపార్టీకి చెందిన అనేక మంది ప్రజా ప్రతినిధులున్నారని, ఒక్కరు కూడా జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు గురించి కానీ, కనిగిరి నిమ్జ్‌ గురించి గానీ, దొనకొండ పారిశ్రామికవాడ గురించి గానీ చట్టసభల్లో ప్రశ్నించిన నాయకుడు లేడన్నారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్‌ నాయకులు అందె నాసరయ్య, నెల్లూరు జిల్లా కార్యదర్శి వెంకయ్య, జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ, కార్యవర్గసభ్యులు ఆర్‌ వెంకట్రావు, వడ్డె హనుమారెడ్డి, కే వీరారెడ్డి, ఆర్‌ రామకృష్ణ, యాసిన్‌, రమేష్‌, లక్ష్మి, ఎం విజయ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఘనంగా ప్రారంభమైన సీపీఐ జిల్లా మహాసభలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement