
సైబర్ నేరాలపై బ్యాంకర్లకు అవగాహన
ఒంగోలు టౌన్: సైబర్ నేరాలను సకాలంలో పసిగట్టి వెంటనే అప్రమత్తం అయితే నష్టం జరగకుండా చేయవచ్చని ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ చెప్పారు. సైబర్ నేరాల నివారణపై శనివారం నగరంలోని బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సూర్యనారాయణ మాట్లాడుతూ.. ప్రజల అత్యాశ, భయాందోళనలను ఆసరా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడుతున్నారని చెప్పారు. అపరిచితుల నుంచి వచ్చే ఎస్ఎంఎస్, ఈ మెయిల్స్, వాట్సప్లో వచ్చే లింకులును ఓపెన్ చేయడానికి ముందు అన్నీ రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. డిజిటల్ అరెస్టు, ఆన్లైన్ రుణాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బ్యాంక్ రివార్డులు, ఇతర మోసాల గురించి బ్యాంకు సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని, కస్టమర్లను అప్రమత్తం చేయాలని చెప్పారు. సమావేశంలో నగరంలోని అన్నీ బ్యాంకులకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
కూటమి నాయకుల మధ్య మాటల యుద్ధం
పెద్దారవీడు: అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా పెద్దారవీడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీడీపీ నాయకులకు బీజేవైఎం నాయకులకు మధ్య శనివారం ఉదయం వాగ్వాదం చోటుచేసుకుంది. కార్యక్రమానికి టీడీపీ నాయకులు బీజేఎంవై నాయకులు హాజరయ్యారు. బీజేవైఎం ఐటీ రాష్ట్ర కన్వీనర్ జీవీరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మా పార్టీ కూడా ఉందని, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటో ఉండాలని, కార్యక్రమానికి పిలిచి అవమానం చేయడం ఏమిటని ఎంపీడీఓను ప్రశ్నించారు. ఆ విషయంపై ఎంపీడీఓ బీజేవైఎం నాయకులకు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు జోక్యం చేసుకొని ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటో పెట్టాల్సిన అవసరం లేదని, అసలు మిమ్మల్ని ఎవరు పిలిచారు, ఎందుకు వచ్చారని, మీరు ఇక్కడ నుండి వెళ్లిపోవాలని, చేతనైతే మీ నాయకుడు మోదీకి చెప్పుకోవాలని, నీవు ఏం చేసుకుంటాయో చేసుకో అని కొంత సేపు దుర్భాషలాడుతూ ఆవేశంగా మాట్లాడారు. బీజేవైఎం నాయకుడు మాట్లాడుతూ ‘‘అధికారులు పిలిస్తే కార్యక్రమానికి వచ్చామని, నీవు ఎవరు మమ్మల్ని వెళ్లిపొమ్మనడానికి, నీవు బెదిరిస్తే బెదిరి పోవడానికి లేము, మాటలు జాగ్రత్తగా మాట్లాడు’’ అని ఘాటుగా ఎదురు మాట్లాడారు. ఈ విషయంపై పార్టీ నాయకులకు ఫిర్యాదు చేయనున్నట్లు బీజేవైఎం నాయకులు జీవీరెడ్డితో పాటు బీజేవైఎం జిల్లా కార్యదర్శి వాయిరి రామకృష్ణ, బీజేవైఎం మండల అధ్యక్షుడు పాలంకయ్య తెలిపారు. ఎంపీడీఓ జాన్సుందరం వివరణ కోరగా బీజేవైఎం నాయకులకు యోగా కార్యక్రమానికి హాజరు కావాలని సమాచారం ఇచ్చామని, వారు కార్యక్రమానికి హాజరయ్యారన్నారు. రెండు పార్టీల నాయకులకు సర్దిచెప్పామన్నారు.

సైబర్ నేరాలపై బ్యాంకర్లకు అవగాహన