
ఉత్సాహంగా అండర్ 16 జిల్లా క్రికెట్ జట్టు
ఒంగోలు: అండర్ 16 జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. స్థానిక మంగమూరు డొంకలోని ఏసీఏ సబ్ సెంటర్లో శనివారం నిర్వహించిన ఎంపిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి దాదాపు 80 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రాథమికంగా హాజరైన వారి నుంచి 26 మందిని ఎంపిక చేశామన్నారు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం రావినూతల ఆర్సీఏ గ్రౌండ్లో ఈనెల 26 నుంచి ప్రాబబుల్స్ మ్యాచ్లు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారితో తుది జట్టును ప్రకటిస్తారన్నారు. జూలై 3 నుంచి 13వ తేదీ వరకు మంగళగిరి/ పేరేచర్లలో జరిగే ఏసీఏ సెంట్రల్ జోన్ అంతర్ జిల్లాల పోటీలో ప్రకాశం జిల్లా తరఫున ఎంపికై న జట్టు ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. ఈ ఎంపిక కార్యక్రమాన్ని కోశాధికారి హనుమంతరావు, సంయుక్త కార్యదర్శి బచ్చు శ్రీనివాసరావు, బలరాం, రామకృష్ణారెడ్డి, కత్తిశివ, నల్లూరి రవి, ఉండవల్లి రాము, కోచ్లు సుధాకర్, చంద్ర, సెలెక్టర్లు శ్రీకృష్ణ తదితరులు పాల్గొని పర్యవేక్షించారు.