
కబళించిన అతివేగం
బేస్తవారిపేట: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందగా, ఆమె భర్త, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ఒంగోలు–నంద్యాల హైవేపై బేస్తవారిపేట మండలంలోని చెట్టిచర్ల సమీపంలో శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. విజయవాడ నుంచి కడప వెళ్తున్న క్రాంతి ట్రాన్స్పోర్ట్ లారీని టాయిలెట్ కోసం హైవే పక్కన చెట్టిచర్ల సమీపంలో డ్రైవర్ ఆపాడు. అదే సమయంలో బాపట్ల జిల్లా పొన్నలూరు నుంచి నంద్యాలకు కారులో ఐ.శ్రీనివాసులు, అతని భార్య అరుణ (29), ఇద్దరు పిల్లలు రిషికేష్, హన్విక వెళ్తున్నారు. వేగంగా వెళ్తున్న వీరి కారు హైవే మార్జిన్లో నిలిపి ఉంచిన ట్రాన్స్పోర్ట్ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. లారీ వెనుక వైపు కూరుకుపోయిన కారు నుజ్జునుజ్జయింది. ముందుసీట్లో కూర్చుని ఉన్న అరుణ అక్కడికక్కడే మృతిచెందింది. డ్రైవింగ్ చేస్తున్న ఆమె భర్త శ్రీనివాసులు, వెనుక కూర్చుని ఉన్న పిల్లలు రిషికేష్, హన్వికలకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై ఎస్వీ రవీంద్రారెడ్డి వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన వారిని హిటాచ్ యంత్రం సాయంతో బయటకు తీయించారు. అప్పటికే అరుణ మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులు, రిషికేష్, హన్వికలను హైవే అంబులెన్స్లో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి గుంటూరు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాసులు నంద్యాలలోని ఓ ప్రైవేట్ విత్తన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
భర్త, ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలు
ట్రాన్స్పోర్ట్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టి నుజ్జునుజ్జయిన కారు
బేస్తవారిపేట మండలం చెట్టిచర్ల సమీపంలో ఘటన

కబళించిన అతివేగం

కబళించిన అతివేగం

కబళించిన అతివేగం

కబళించిన అతివేగం