
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు
ఒంగోలు టౌన్: మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని ఒంగోలు ట్రాఫిక్ సీఐ పాండురంగారావు హెచ్చరించారు. శనివారం ఒంగోలు నగరంలో మైనర్ డ్రైవింగ్పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వాహనాలు నడుపుతున్న 35 మంది మైనర్లను గుర్తించారు. వారితో పాటు వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ పాండురంగారావు మాట్లాడుతూ పిల్లల మీద ప్రేమ ఉంటే వారికి వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ఏదైనా ప్రమాదం జరిగితే జీవితాంతం బాధపడాల్సి వస్తుందన్నారు. ప్రేమ, గారాబం కంటే ప్రాణాలు ఎక్కువనే విషయం తల్లిదండ్రులు గుర్తించాలని హితవు పలికారు. చిన్నపిల్లలకు ఎలాంటి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని చెప్పారు. మైనర్లు వాహనాలు నడపడం చట్ట విరుద్ధమన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్, సీటు బెల్టులు తప్పనిసరిగా ధరించాలని, అతివేగంగా వాహనాలను నడపరాదని, మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలను నడపరాదని సూచించారు. మైనర్లు వాహనం నడిపినా, మైనర్లకు వాహనం ఇచ్చినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కౌన్సిలింగ్లో ట్రాఫిక్ ఎస్సై కోటయ్య, ఆర్ఎస్సై మాల్యాద్రి, సిబ్బంది పాల్గొన్నారు.