
గిట్టుబాటు ధరలు ఇప్పించడంలో రాష్ట్రం విఫలం
ఒంగోలు టౌన్: పొగాకు రైతులకు గిట్టుబాటు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ విమర్శించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు ఇప్పించేందుకు ప్రభుత్వం ముందకు వచ్చి అన్నీ రకాల పొగాకును కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక మల్లయ్యలింగం భవనంలో శుక్రవారం పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వీరారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేవీవీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పొగాకు రూపంలో వేల కోట్లు పన్నుల రూపంలో విదేశీ మారకద్రవ్యం వస్తుందని, అరలుునా పొగాకు రైతులకు న్యాయం చేయాలన్న ధ్యాస లేదని మండిపడ్డారు. ధాన్యం రైతులను కూడా ప్రభుత్వం బజారున పడేసిందని మండిపడ్డారు. మద్దతు ధర కంటే రూ.200 నుంచి రూ.300 తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఎగుమతి విధానాలు బడా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నాయన్నారు. అందుకే రైతులు నష్టపోతున్నా పట్టించుకోవడంలేదని విమర్శించారు. విదేశాల్లో పొగాకు సాగు లెక్కలను అంచనా వేసుకొని మన దేశంలోని రైతులకు పొగాకు సాగు చేయాలని సూచనలు చేయకుండా నిర్లక్ష్యం చేసిన బోర్డు అధికారులు ఇప్పుడు విదేశాల్లో పొగాకు పంట ఎక్కువ సాగయ్యిందని చెప్పడం క్షమార్హం కాదన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు మాట్లాడుతూ ఐటీసీ మోచేతి నీళ్లు తాగే కొందరు తొత్తు రైతు నాయకులు చేస్తున్న మోసాన్ని పొగాకు రైతులు గమనించాలని కోరారు. వారి పంటలకు మాత్రం గిట్టుబాటు ధరలు దక్కించుకుంటున్నారని, మిగిలిన రైతులకు ధరలు రాకుండా చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. డబుల్ ఇంజిన్ సర్కార్లో ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేవని, ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్డే హనుమారెడ్డి మాట్లాడుతూ మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు నాయకులు చుంచు శేషయ్య మాట్లాడుతూ పొగాకు కేంద్రాల్లో లో గ్రేడ్ రకాన్ని కొనుగోలు చేసే నాథుడే లేకుండా పోయాడని చెప్పారు. కార్యక్రమంలో రైతు నాయకులు పమిడి వెంకటరావు, పరిటాల కోటేశ్వరరావు, కోడూరు నాంచార్లు, దేవరకొండ సుబ్బారెడ్డి, వడ్డేళ్ల ప్రసాద్, అబ్బూరి శేషగిరి తదితరులు పాల్గొన్నారు.