
ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకనే..
ఉపాధి హామీ కూలీల ఫొటోలు ఇష్టారీతిగా అప్లోడ్ చేయడం, పాత పనులనే కొత్తగా చేసినట్టు చూపడం, ఒకే ఫొటోను అప్లోడ్ చేసి అందరికీ మస్టర్ వేయడం.. లాంటివి నిత్యకృత్యమయ్యాయి. కొందరు కూలీలు కూడా ఇదేదో బాగుందిలే పనికి వెళ్లకుండానే రూ.200 పోయిన రూ.1000 వస్తున్నాయి కదా అని మేట్లకు వారు అడిగినంత డబ్బు ఇస్తుండటం గమనార్హం. పలు గ్రామాల్లో అయితే స్థానికగా లేకున్నా మస్టర్లు వేస్తూ వారు పనికి వచ్చినట్లుగా జాబ్కార్డు నంబర్లు పెట్టి వారి స్థానంలో మరొకరు ఫొటోలు దిగుతున్నారు. ఇటీవల మంగాపురంలో మేట్ చేస్తున్న అవినీతిని పలువురు ప్రశ్నించగా ‘కచ్చితంగా డబ్బు ఇస్తేనే మీకు నగదు పడేలా చేస్తాం. లేకుంటే మీకు దిక్కున్నచోట చెప్పుకోండి. మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు’అంటూ మేట్ తెగేసి చెప్పాడు. పనికి వచ్చిన వారికి మస్టర్ వేయకుండా, పనికి రాని వారికి హాజరు వేయడం ఏమిటని కూలీలు నిలదీస్తున్నా సమాధానం లేదు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న వ్యక్తులపై ఉన్నతాధికారులు సైతం ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా కొనకనమిట్లలో అయితే ఎక్కడో ఉంటున్న వారికి మస్టర్ వేసి డబ్బు పంచుకుంటున్నారని ఇటీవల కొందరు కలెక్టర్కు అర్జీ అందజేశారు. దీనిపై ఏపీడీ తూతూ మంత్రం నివేదికలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపారు. ఉపాధి పనుల్లో జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారులు స్పందించి అవకతవకలపై చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.