పల్లె రోడ్లు గుల్ల | - | Sakshi
Sakshi News home page

పల్లె రోడ్లు గుల్ల

Jun 20 2025 6:55 AM | Updated on Jun 20 2025 6:55 AM

పల్లె

పల్లె రోడ్లు గుల్ల

బేస్తవారిపేట/పెద్దారవీడు: రహదారుల నిర్మాణం, మరమ్మతులను ప్రభుత్వం గాలికొదిలేయడంతో వాహనదారులకు ప్రాణసంకటంగా మారింది. గోతులమయంగా మారిన, కంకర తేలిన రోడ్లపై రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు నిర్మిస్తామన్న కూటమి ప్రభుత్వ హామీ కార్యరూపం దాల్చలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయినా కొత్త రోడ్లు వేయలేదు సరికదా పాడైన రోడ్లకు సైతం మరమ్మతులు చేయలేదని బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో రోడ్లపై గగ్గోలు పెట్టిన కూటమి నాయకులు.. ప్రస్తుతం రహదారుల పరిస్థితిపై మాత్రం నోరు మెదపడం లేదు. పలు గ్రామాల్లో కూటమి నాయకులు తమకు అనుకూలంగా ఉండే వీధుల్లో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో సిమెంటు రోడ్లు వేసుకోవడంపై చూపిన శ్రద్ధ, రాష్ట్రీయ, జాతీయ రహదారులను అనుసంధానం చేస్తే లింక్‌ రోడ్ల మరమ్మతులపై పెట్టలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ప్రయాణం.. ప్రాణాపాయం

● బేస్తవారిపేట మండల కేంద్రం నుంచి జేబీకే పురం, చిన్న కంభం, జేబీకే పురం రైల్వేస్టేషన్‌కు వెళ్లే బీటీ రోడ్డు గోతులమయంగా మారింది. లోతైన గుంతల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. నిత్యం ఏదో ఒకపనిపై మండల కేంద్రానికి వచ్చే జేబీకే పురం గ్రామస్తులు, పొలాలకు వెళ్లే రైతులు అవస్థలు పడుతున్నారు.

● చింతలపాలెంలోకి వెళ్లే ప్రధాన సీసీరోడ్డు ఛిద్రమైంది. రోడ్డంతా గుంతలు, పగుళ్లతో దారుణంగా తయారైంది. ఈ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని చింతలపాలెం, హరజరత్‌గూడెం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

● బేస్తవారిపేట మండలంలోని వంగపాడులో మెయిన్‌ రోడ్డు నుంచి ఎస్సీ కాలనీలోకి వెళ్లే సీసీ రోడ్డు పశువుల దిబ్బగా మారింది. పశువుల వ్యర్థాలను సీసీ రోడ్డుపైనే వేస్తున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి రోడ్డుపై వ్యర్థాలు వేయకుండ చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

● కోనపల్లె లోయకు వెళ్లే తారురోడ్డుకు ఇరువైపులా మార్జిన్‌లు కొట్టుకుపోయాయి. మార్జిన్లలో భారీ గుంతలు ఏర్పడటంతో వాహనాల రాకపోకల సమయంలో తంటాలు తప్పడం లేదు. రాత్రి వేళల్లో ఈ రోడ్డులో ప్రయాణం ప్రాణాలతో చెలగాటమే. దాదాపు 30 గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగేంచే రోడ్డు అభివృద్ధిపై పాలకులు దృష్టిపెట్టాలని లోయ ప్రాంత ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

● పెద్దారవీడు మండలంలోని చట్లమిట్ల అడ్డరోడ్డు నుంచి రేగుమానిపల్లి, అలాగే ఏనుగుదిన్నెపాడు నుంచి తోకపల్లి, చట్లమిట్ల నుంచి బద్వీడు గ్రామాలకు వెళ్లే తారు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. గోతులు పడి, కంకర రాళ్లు పైకి తేలడంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోజూ నరకమే..

రోడ్లపై తారు లేచి, పెద్ద పెద్ద గుంతలు పడటంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. రాత్రి పూట రోడ్డుపై గుంతలు కనిపించక బైకులపై వెళ్లేవారు కిందపడి గాయాలపాలవుతున్నారు. మూలమలుపుల వద్ద చిల్లకంప రోడ్డు మీదకు రావడంతో ఎదురుగా వచ్చే ఏ వాహనమూ కనిపించడం లేదు. వర్షం పడితే రోడ్లపై గుంతలు నీటితో నిండిపోయి ఎటు వెళ్లాలో తెలియడం లేదు. అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయాలని కోరుతున్నాం.

– గజ్జ యోగిగురవారావు,

ప్రగళ్లపాడు(పెద్దారవీడు)

జంగిల్‌ క్లియరెన్స్‌ పనులేవీ?

గ్రామాలకు వెళ్లే రహదారులకు ఇరువైపులా చిల్లచెట్లు ఏపుగా పెరగడంతో వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. మూలమలుపుల వద్ద చిల్లకంప రోడ్డును కమ్మేయడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికై నా పాలకులు స్పందించి నూతన రహదారులు నిర్మించడంతోపాటు అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

పల్లె రోడ్లు గుల్ల 1
1/3

పల్లె రోడ్లు గుల్ల

పల్లె రోడ్లు గుల్ల 2
2/3

పల్లె రోడ్లు గుల్ల

పల్లె రోడ్లు గుల్ల 3
3/3

పల్లె రోడ్లు గుల్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement