
వెన్నుపోటుకు బాబు బ్రాండ్ అంబాసిడర్
సింగరాయకొండ: వెన్నుపోటుకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. స్థానిక పార్టీ క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం జగనంటే నమ్మకం– బాబు అంటే మోసం పుస్తకావిష్కరణలో భాగంగా ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. డాక్టర్ సురేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే వ్యతిరేకత వచ్చిందన్నారు. ఏడాదిలో సక్రమంగా ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు సూపర్సిక్స్ పథకాలు అమలు చేశామని, కాదన్న వాడి నాలుక మందం అని అన్నారని, 5 కోట్ల ప్రజల నాలుక మందమా అని చంద్రబాబును ప్రశ్నించారు. ఉచిత గ్యాస్ నగదు సక్రమంగా జమ కాలేదని, తల్లికి వందనంలో భారీ కోతలు విధించి అమలు చేశామని గొప్పలు చెప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. అన్నదాత సుఖీభవ పథకంలో భారీ కోతలు కనిపిస్తున్నాయని మండిపడ్డారు.
రాష్ట్రంలో అరాచక పాలన
చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవడం రాష్ట్ర ప్రజలకు అలవాటుగా మారిందన్నారు. రాష్ట్రంలో జరుగుతుంది సంక్షేమ పాలన కాదని అరాచకపాలన అని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నేతలను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారన్నారు. 70 ఏళ్ల వయసున్న సీనియర్ పాత్రికేయుడు కేఎస్ఆర్పై అక్రమ కేసు బనాయించి జైలుకు పంపారని, సుప్రీంకోర్టు అక్షింతలు వేస్తే గానీ విడిచిపెట్టలేదన్నారు. హోంమంత్రి వంగలపూడి అనితపై చెక్బౌన్స్ కేసు ఉందని ఆరోపించారు. నీతి, నియమాలు లేని వ్యక్తి మంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యమని, వీరు శాంతిభధ్రతలు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మంత్రులకు జగనన్నను తిడితే మంత్రి పదవి ఉంటుందని చంద్రబాబు కండీషన్ పెట్టినట్లు ఉందని, దీంతో మంత్రులు పోటీపడి పాలనను గాలికి వదేలిస జగనన్నపై విమర్శలు చేయడం పనిగా పెట్టుకున్నారన్నారు. జగనన్న రైతుల సమస్యపై ప్రశ్నిస్తే తప్ప కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. సంక్షేమ పథకాలను గాలికొదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కనుసన్నల్లో షర్మిల పనిచేస్తుందని, చంద్రబాబు స్విచ్ నొక్కగానే విమర్శించడం పరిపాటిగా మారిందని ఇదంతా డైవర్షన్ రాజకీయాల్లో భాగమన్నారు. చంద్రబాబు కేసులు, జైళ్లు అంటూ మా గొంతు ఎంతనొక్కుదామన్నా ఉపేక్షించేది లేదని, ప్రజా సమస్యలపై ఎలుగెత్తి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు మసనం వెంకట్రావు, చింతపల్లి హరిబాబు, పిన్నిక శ్రీనివాసులు, బచ్చల కోటేశ్వరరావు, ఇనకొల్లు సుబ్బారెడ్డి, జడ్పిటిసి బెజవాడ వెంకటేశ్వర్లు, పార్టి ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తుల అశోక్కుమార్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఢాకా పిచ్చిరెడ్డి పాల్గొన్నారు.
మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్