మర్రిపూడి: పశువుల బీడు అక్రమంగా ఆన్లైన్ చేసి ఏ విధంగా పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తారని ఎంపీపీ వాకా వెంకటరెడ్డి..డిప్యూటీ తహసీల్దార్ నాగరాజుపై మండిపడ్డారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం మండల సమావేశం నిర్వహించారు. సమావేశంలో రెవెన్యూ అధికారుల పనితీరుపై సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఎంపీపీ వాకా వెంకటరెడ్డి మాట్లాడుతూ గుండ్లసముద్రంలో పశువులు మేపుకునే బీడు భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ఆన్లైన్ చేసి ఎలా పాసుపుస్తకాలు మంజూరు చేస్తారని మండిపడ్డారు. పేదలకు పంచకుండా భూమి ఉన్న వారికే ఆక్రమంగా ఏ విధంగా కట్టబెట్టారని నిలదీశారు. వారసత్వ భూమిని ఆన్లైన్ చేయాలన్నా ఏదో సాకు చెప్పే అధికారులు పశువుల బీడును ఆన్లైన్ చేయడం ఏంటని ప్రశ్నించారు. మూడు నెలలకు ఒకసారి జరిగే సర్వసభ్య సమావేశానికి మండల స్థాయి అధికారులు గైర్హాజరు కావడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ జైపాల్ మాట్లాడుతుండగా.. కోఆప్షన్ సభ్యుడు కొండ్రు ఇజ్రాయిల్, అంకేపల్లి సర్పంచ్ తిరుపతమ్మ కలుగజేసుకుని వాటర్ ట్యాంక్లు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయని, క్లోరినేషన్ చేయకపోవడంతో కలుషిత నీరు సరఫరా అవుతుందని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. జెడ్పీటీసీ మానేకి సుధారాణి వెంకట్రావు మాట్లాడుతూ ఉపాధి కూలీలు పనికి వెళ్లాలంటే పచ్చ గుర్తింపు కార్డులు ఉంటేనే రమ్మంటున్నారని,
ఇదేంటని ప్రశ్నించారు. ఎంపీడీఓ జగదీష్, ఇంచార్జీ ఎంపీడీఓ నాగూర్వలి, డీప్యూటీ తహశీల్దార్ నాగరాజు, ఏఓ ఖాఖింపీరా, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు.