
యోగాంధ్రను విజయవంతం చేద్దాం
ఒంగోలు: అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో జిల్లా ప్రజలు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా గురువారం పిలుపునిచ్చారు. స్థానిక మినీ స్టేడియంలో స్వయం సహాయక సంఘాల మహిళలతో శుక్రవారం నిర్వహిస్తున్న కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులతో మాట్లాడుతూ.. సుమారు 5 వేల మంది స్వయం సహాయక సంఘాల మహిళలు యోగా కార్యక్రమానికి హాజరవుతున్నందున, వారికి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. శుక్రవారం స్వయం సహాయక సంఘాల సభ్యులతో నిర్వహిస్తున్న యోగా సాధన, శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జిల్లాలో 11 లక్షల మంది యోగాంధ్రలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, యోగా నిర్వహించేందుకు 6,458 ప్రదేశాలను గుర్తించామని వివరించారు. కలెక్టర్ వెంట డీఆర్ఓ చిన ఓబులేసు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, మెప్మా, డీఆర్డీఏ పీడీలు శ్రీహరి, నారాయణ, పశు సంవర్థక శాఖ జేడీ రవికుమార్ పాల్గొన్నారు.
కలెక్టర్ తమీమ్ అన్సారియా
మినీ స్టేడియంలో ఏర్పాట్ల పరిశీలన