
వేట నేర్వక.!
అడవి చేరక..
నిరుపయోగంగా ఉన్న
ఎన్క్లోజర్ల కోసం తెచ్చిన సామగ్రి
పెద్దదోర్నాల:
● రెండేళ్ల కిందట నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురంలో నాలుగు ఆడపులి పిల్లలు తల్లి నుంచి విడిపోయి దిక్కుతోచని స్థితిలో స్థానికుల కంటపడ్డాయి. ఈ క్రమంలో అవి పెరిగి పెద్దవవుతుండటంతో వాటిని సహజ సిద్ధంగా ఉండే అటవీ ప్రాంత వాతావరణంలో వదిలి పెట్టేందుకు అటవీశాఖ గతంలో నిర్ణయం తీసుకుంది.
● తిరుపతి జూ పార్కులోనూ తల్లి నుంచి విడిపోయి విడిగా పెరుగుతున్న పిల్లలను ప్రత్యేకంగా సంరక్షించాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించారు.
చిన్నప్పుడే తల్లి నుంచి విడిపోయిన పులి కూనలను జూలలో సంరక్షించేవారు. దీంతో అవి సహజ స్వభావాన్ని కోల్పోతున్నాయి. పులి పిల్లలను అటవీ ప్రాంతంలోనే ఉంచి వేట నేర్పేందుకు నల్లమల అభయారణ్యంలో భారీ టైగర్ ఎన్క్లోజర్ ఏర్పాటు చేయాలని అటవీశాఖ నిర్ణయించింది. జిల్లాలోని నెక్కంటి రేంజ్ పెద్దపెంట ప్రాంతం ఇందుకు అనువైనదిగా గుర్తించారు. పెద్దపెంట, ఆరపెంట, గంగారంపెంట, పెద్దదోర్నాల మండలంలోని తెట్టుగూడెం పరిధిలో టైగర్ ఎన్క్లోజర్తో పాటు నర్సరీ, హెర్బివోస్ల ఎన్క్లోజర్లు నిర్మించాలని ప్రతిపాదనలు చేసింది. దీనికి సంబంధించి అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులు మంజూరు చేసింది.
మందగించిన నిర్మాణ పనులు...
15 హెక్టార్లలో నాలుగు ఎన్క్లోజర్లు ఏర్పాటు చేయాలకున్నారు. తొలుత 400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నర్సరీ ఎన్క్లోజర్ ఏర్పాటు చేసి అందులో పులి కూనలను ఉంచి కోడి, మేక మాంసాన్ని ఆహారంగా ఇస్తారు. ఆ తర్వాత మరో ఎన్క్లోజర్లోకి మార్చివేసి చిన్నపాటి మేకలను వదులుతారు. సొంతంగా వేటాడేలా నేర్పిస్తారు. అనంతరం మరో ఎన్క్లోజర్లో ఉంచి జింకలు, దుప్పులు, ఇతర వన్యప్రాణులను వదులుతారు. ఇలా వన్యప్రాణులను వేటాడిన తర్వాత వాటిని అడవిలోకి వదులుతారు. కానీ, అటవీశాఖ నిర్లక్ష్యంతో తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా పులుల సంరక్షణ ప్రక్రియకు ప్రయోగాత్మకంగా ఎన్క్లోజర్లు ఏర్పాటు చేయాలన్న లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరకుండా పోయింది.
సొంతంగా వేటాడగలిగేలా..
మొదటిగా నర్సరీ ఎన్క్లోజర్లో ఉంచిన పులి పిల్లలను టైగర్ ఎన్క్లోజర్లోకి మార్చి వ్యక్తిగతంగా ఆహారం కోసం అవి 50 వన్యప్రాణులను సొంతంగా వేటాడగలిగినప్పుడే అభయారణ్యంలోకి వదులుతారు. దీంతో పెద్దపులులు వేటాడటం కోసం నెక్కంటి రేంజి పరిధిలోని ఆరపెంట, గంగారంపెంట, పెద్దదోర్నాల మండల పరిధిలోని తెట్టుగూడెం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హెర్బివోస్ (జింకలు, దుప్పుల) నర్సరీలు సైతం నిరుపయోగంగా మారాయి. ఇందుకోసం ఆయా ఎన్క్లోజర్లలో రూ.2.50 లక్షలతో సోలార్ బోరుతో పాటు ఎన్క్లోజర్లోకి పైప్లైన్ సదుపాయం, జింకల అవసరాలు తీర్చేందుకు సాసర్పిట్లు, సహజ సిద్ధంగా ఉండే నీటి గుంతలు సైతం ఏర్పాటు చేశారు. సాధారణంగా కొద్ది రోజుల పాటు వాటిని సంరక్షించిన అనంతరం పులుల కోసం ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్లలో వదలటం ద్వారా పులులకు వేటాడటాన్ని అలవాటు చేస్తారు. వేటలో వాటి శక్తియుక్తులను గుర్తించి తదుపరి చర్యలు తీసుకుంటారు. అయితే, ఇవేమీ జరగకుండానే టైగర్ ఎన్క్లోజర్ పనులు మందగించాయి. ప్రస్తుతం తిరుపతి జూలో ఉన్న అవి పెరిగి పెద్దవిగా అయిపోయాయి.
ఎన్క్లోజర్ పనులకు కొత్తగా టెండర్లు
అధికారుల బదిలీలు, గతంలో భారీ వర్షాల కారణంగా పనులు కొంత మేర మందగించాయి. టెండర్ల ప్రక్రియ పూర్తయితే పనులు చురుగ్గా జరిగే అవకాశం ఉంది. కొత్తపల్లి పులి పిల్లలు పెద్దవి కావటంతో వాటిని తీసుకొచ్చే అంశం పరిశీలనలో ఉంది.
– ప్రసన్నజ్యోతి,
ఫారెస్ట్ రేంజ్ అధికారి, కొర్రప్రోలు
తెలుగు రాష్ట్రాల్లో తొలి పులికూనల సంరక్షణ కేంద్రం
ప్రకాశం జిల్లా పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఏర్పాటుకు నిర్ణయం
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.2 కోట్లు విడుదల
అటవీశాఖ నిర్లక్ష్యంతో నెరవేరని పులి పిల్లల సంరక్షణ
ఉన్నతాధికారుల బదిలీలతో పనుల నిలిపివేత
ఇప్పటికే పెరిగి పెద్దవిగా మారిన బెబ్బులులు

వేట నేర్వక.!