
చిరువ్యాపారులపై మరోసారి వేధింపులు
ఒంగోలు సబర్బన్:
నగరంలో కొత్త కూరగాయల మార్కెట్లోని షాపుల్లో వ్యాపారాలు చేసుకుంటున్న వారిపై నగరపాలక సంస్థ అధికారుల వేధింపులు మరోసారి కొనసాగాయి. మార్కెట్లోని షాపులకు కరోనా సమయంలో అద్దెలు చెల్లించలేదన్న కారణంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరపాలక సంస్థ అధికారులు రెండు నెలల క్రితం దాడులు చేసి మార్కెట్ను చిన్నాభిన్నం చేశారు. వ్యాపారులను భయాందోళనకు గురిచేశారు. ప్రధానంగా వైఎస్సార్ సీపీ సానుభూతిపరులైన వారి షాపులను టార్గెట్ చేసి వేధించారు. ఆ సమయంలో వ్యాపారులంతా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వద్దకు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కరోనా సమయంలో అన్ని వ్యాపారాలను నిలిపివేయడంతో ఒంగోలు నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ను కూడా మూసివేశారు. 2019–20, 2020–21 సంవత్సరాల్లో స్థానిక పీవీఆర్ హైస్కూల్ గ్రౌండ్లో ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి కూరగాయలు విక్రయించారు. నగర ప్రజలతో పాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల ప్రజలు అక్కడికే వెళ్లి కూరగాయలు కొనుగోలు చేశారు. కానీ, కరోనా సమయంలోనూ కూరగాయల మార్కెట్లోని షాపులకు బాడుగలు కట్టాలంటూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారులపై వేధింపులు ప్రారంభించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దామచర్ల దృష్టికి వ్యాపారులు తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనేకసార్లు సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే స్థానికంగా లేని సమయంలో గురువారం ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులు మార్కెట్లోని రిటైల్ షాపులకు తాళాలు వేశారు.
పోలీసులను తీసుకెళ్లి మరీ...
మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు పోలీసులను తీసుకెళ్లి మరీ మార్కెట్లోని రిటైల్ షాపులకు తాళాలు వేయించారు. ఇది ఎమ్మెల్యే దామచర్ల వ్యూహమా.. లేకుంటే మేయర్, కమిషనర్ వేధింపులా అనేదానిపై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని మార్కెట్లో సమావేశం ఏర్పాటు చేసిమరీ బహిరంగంగా దామచర్ల చెప్పిన తర్వాత కూడా గురువారం ఆయన లేని సమయంలో షాపులకు తాళాలు వేయడం, బుధవారం రాత్రే విద్యుత్ సరఫరా కూడా నిలిపివేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ ఎమ్మెల్యేకి తెలియకుండా జరిగే అవకాశం లేదని, ఆయన ఆదేశాల మేరకే వ్యాపారులపై వేధింపులు జరుగుతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానంటూ పైకి ఎమ్మెల్యే చెబుతున్నప్పటికీ.. వైఎస్సార్ సీపీ సానుభూతిపరులైన వ్యాపారులను వేధించేందుకు, పొమ్మనలేక పొగబెట్టేందుకు, తాను ఇక్కడ లేని సమయంలో షాపులపై దాడులు చేయాలని అధికారులకు ఆయనే చెప్పి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో మొత్తం 193 షాపులున్నాయి. వాటిలో 123 రిటైల్ షాపులు, 70 హోల్ సేల్ షాపులు ఉన్నాయి. వీటిలో కేవలం వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల షాపులను మాత్రమే నగరపాలక సంస్థ అధికారులు టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ సానుభూతిపరుల షాపుల జోలికి వెళ్లడం లేదు. దాదాపు 60 షాపులకు గురువారం తాళాలు వేశారు. తమను ఈ విధంగా ఎంతకాలం వేధిస్తారంటూ షాపుల యజమానులు గగ్గోలుపెడుతున్నారు.
ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్పై నగరపాలక సంస్థ అధికారుల దాడులు
కరోనా సమయంలో కట్టాల్సిన అద్దెల విషయంలో షాపులకు తాళాలు
ముందు రోజే కరెంటు కట్
రెండు నెలల క్రితం మార్కెట్ చిన్నాభిన్నం
ప్రభుత్వంతో మాట్లాడతానని అప్పట్లో హామీ ఇచ్చిన ఎమ్మెల్యే దామచర్ల
ప్రస్తుతం ఆయన లేని సమయంలో అధికారుల దాడులపై అనేక అనుమానాలు
వైఎస్సార్ సీపీ వర్గీయులే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వేధిస్తున్నారంటూ ఆరోపణలు