
నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
● పోలీస్, ఎకై ్సజ్ అధికారులతో కలెక్టర్ తమీమ్ అన్సారియా సమీక్ష
ఒంగోలు సబర్బన్: నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. నాటుసారా నిర్మూలన కార్యక్రమమైన నవోదయం 2.0పై స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ అధికారులతో గురువారం కలెక్టర్ సమీక్షించారు. ఎస్పీ ఏఆర్ దామోదర్తో కలిసి జిల్లాస్థాయి సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా ప్రకటిస్తూ డిక్లరేషన్ చేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 19న రాష్ట్ర స్థాయి నవోదయం 2.0 కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహించుకుని నాటుసారా రహిత జిల్లాగా మార్చేందుకు సంకల్పం తీసుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగా జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ, అటవీ శాఖల అధికారుల సహకారంతో గత నాలుగు నెలల కాలంలో జిల్లాలో నాటుసారా తయారీదారులు, వినియోగదారులకు అవగాహన కల్పించడం, నాటుసారా యూనిట్లను నిర్మూలించడం వంటి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దీనివలన ప్రకాశం జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా ప్రకటించడానికి అవకాశం కలిగిందన్నారు. ఒకసారి నాటుసారా రహిత జిల్లాగా ప్రకటించిన తర్వాత ఎక్కడా నాటుసారా తయారీ, వినియోగం జరగకుండా నిరంతరం మానిటరింగ్ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఐడీ లిక్కర్ పీడిత గ్రామాల జాబితాను 8 మండలాల్లో ఎ.బి.సి. కేటగిరీలుగా విభజించడం జరిగిందని తెలిపారు. ఏ కేటగిరీలో 2 గ్రామాలు, బీ కేటగిరీలో 27 గ్రామాలు, సీ కేటగిరీలో 6 గ్రామాలు కలిపి మొత్తం 35 గ్రామాలను గుర్తించడం జరిగిందన్నారు. ఆయా గ్రామాల్లో నాటుసారాను నిర్మూలించి లక్ష్యం చేరుకునేలా పనిచేయాలన్నారు. ఆ వృత్తి నుంచి వారి కుటుంబాలను దూరం చేసి సమాజంలో గౌరవప్రదమైన ఉపాధి మార్గాలను వారికి కల్పించేలా రాయితీలు, పథకాలు అందించాలని సూచించారు. ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ జిల్లాలో నాటుసారాను పూర్తిగా అరికట్టేందుకు పోలీసు శాఖ క్షేత్రస్థాయిలో సహకారం అందిస్తుందని తెలిపారు. అనంతరం నవోదయం 2.0పై అవగాహన కల్పించే కరపత్రాలు, వాల్ పోస్టర్లను కలెక్టర్, ఎస్పీ, అధికారులు ఆవిష్కరించారు. సమీక్ష సమావేశంలో ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు, అసిస్టెంట్ కమిషనర్ దయాసాగర్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అయేషాబేగం, డీఆర్డీఏ పీడీ నారాయణ, ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.