
కూటమి ఏడాది పాలన శూన్యం
● మాజీ మంత్రి మేరుగు నాగార్జున
మద్దిపాడు: గ్రామ స్థాయి నుంచి వైఎస్సార్ సీపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆ పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. మద్దిపాడు మండలంలోని నాగన్నపాలెం, లింగంగుంటలో గురువారం పార్టీ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంవత్సర పాలనలో ఏమీ సాధించలేకపోయిందని విమర్శించారు. కేవలం ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడం మినహా వారు సాధించిందేమీ లేదన్నారు. సూపర్ సిక్స్ పథకాలను గాలికొదిలేసిన ఘనతను మూటగట్టుకుందన్నారు. ప్రజలకు కల్లబొల్లి హామీలిచ్చి అఽధికారంలోకి రావడం, మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని అన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి 80 లక్షల మంది విద్యార్థులకుపైగా అమ్మ ఒడి డబ్బు జమచేస్తే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేవలం 62 లక్షల మందికి మాత్రమే నగదు జమ చేసిందని దుయ్యబట్టారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా నెరవేర్చని కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మేరుగు నాగార్జున తెలిపారు. రైతుల కోసం జగనన్న పోరుబాటను సహించలేక భగ్నం చేయడానకి ప్రయత్నించిన ఘనులు కూటమి నాయకులు అని ఆయన మండిపడ్డారు. కూటమి సర్కార్ సంవత్సర కాలంగా ప్రజలకు ఏమీ చేయకుండా జగన్ నామస్మరణ మాత్రమే చేస్తోందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పూర్తిస్థాయిలో పట్టు సాధించే దిశగా గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ నాగన్నపాలెం గ్రామ అధ్యక్షునిగా పైనం ప్రసాద్, ఉపాధ్యక్షులుగా రాతిక్రింది జాన్ ప్రకాష్, పైనం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శులుగా పైనం శ్రీనివాసరావు, పైనం అంకయ్య, పోకూరి హనుమంతరావు, మరికొందరు సభ్యులను ఎంపిక చేశారు. లింగంగుంట గ్రామ అధ్యక్షునిగా మెడబలిమి శ్రీనివాసరావు ఎంపికయ్యారు. వారికి మేరుగు నాగార్జున పార్టీ కండువాలు కప్పి బాధ్యతలు అప్పగించారు. కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు వాకా కోటిరెడ్డి, వైస్ ఎంపీపీ పైడిపాటి వెంకట్రావు, నాయకులు పల్లపాటి అన్వేష్, బొమ్మల రామాంజనేయులు, గుడ్డపాతల రవి, నాదెండ్ల మహేష్, రజని, సంధ్య, దుడ్డు వినోద్, గద్దె జాలయ్య, కంకణాల సురేష్, ఇతర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.