వేట సొలసి! | - | Sakshi
Sakshi News home page

వేట సొలసి!

Jun 19 2025 7:45 AM | Updated on Jun 19 2025 7:45 AM

వేట స

వేట సొలసి!

అలలు ఎగసి..
● వాతావరణ ప్రభావంతో అలల ఉధృతి ● ఆశాజనకంగా లేని చేపల వేట ● అరకొరగా లభిస్తున్న మత్స్యసంపద ● ఖర్చులకు కూడా రాలేదంటున్న మత్స్యకారులు ● తీరంలో సోనాబోట్ల హల్‌చల్‌ ● బతుకు భారమేనంటున్న మత్స్యకారులు

గంగపుత్రుల ఆశలపై కడలి నీళ్లు చల్లుతోంది. రెండు నెలల నిషేధం అనంతరం సముద్రంలో చేపల వేటకు వెళ్లిన వీరికి ఆశాభంగమే

ఎదురవుతోంది. సాగరంలో నెలకొన్న

ప్రతికూల వాతావరణం వీరిలో అలజడిని రేపుతోంది. ఏటా 61 రోజుల పాటు

మత్స్య సంపద వృద్ధి కోసం చేపల వేటపై నిషేధం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిషేధం ముగిశాక బోట్లలో వేటకెళ్లిన మత్స్యకారులకు ఎగసి పడుతున్న అలలు ప్రతిబంధకంగా మారాయి. ఈ సమయంలో పుష్కలంగా చేపలు లభ్యమవుతాయి.

కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా

అరకొరగా వలకు చిక్కుతున్నాయి.

సింగరాయకొండ:

చేపల పునరుత్పత్తి కోసం ఏటా ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి జూన్‌ 14వ తేదీ వరకు 61 రోజులు వేట నిషేధం అమలులో ఉంటుంది. ఈ సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఇతర పనులు చేసుకుంటూ గడుపుతుండగా ప్రభుత్వం మత్స్యకార భరోసా కింద ఆర్థిక సాయం అందిస్తోంది. జిల్లాలోని తీరప్రాంతంలో ఉన్న కొత్తపట్నం, నాగులుప్పలపాడు, టంగుటూరు, సింగరాయకొండ మండలాల పరిధిలో 1,503 బోట్లు ఉన్నాయి. వీటిలో ఇంజన్‌ బోట్లు 1,111, తెప్ప పడవలు 392 ఉండగా సుమారు 5,800 మత్స్యకార కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. వేట నిషేధకాలం ముగిసింది చేపల వేటకు వెళ్దాం లాభాలు ఆర్జిస్తామని ఆశపడిన వారికి ఈ సంవత్సరం తీవ్ర నిరాశే మిగిలింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో వేట సక్రమంగా సాగడం లేదు.

అలల ఉధృతి:

వాతావరణ ప్రభావంతో సముద్రంలో మూడు రోజులుగా అలల ఉధృతి తీవ్రంగా ఉంది. దీంతో ఆదివారం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు సోమవారం చేపల వేటకు వెళ్లలేదు. మంగళవారం అలల ఉధృతి తగ్గిందని భావించిన కొంతమంది మాత్రమే వేటకు వెళ్లారు. ఒకదాని వెంట ఒకటి అలలు ఉధృతంగా వస్తుండటంతో బోట్లు తిరగబడుతున్నాయని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది సముద్రంలో గాలులు ఎక్కువగా వీస్తాయని, ఇదే గాలులు నెల రోజులు పాటు ఉంటాయని అధికారులు చెబుతుండడంతో వేటసాగేనా అంటూ వాపోతున్నారు.ఇదే జరిగితే పూట గడిచే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అరకొరగా మత్స్య సంపద

సముద్రంలో వేట నిషేధకాలం ముగిసిన తర్వాత వేట ఆశాజనకంగా ఉంటుంది. ఈసారి మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి రోజు ఆదివారం చేపల వేటకు వెళ్లినవారికి కేవలం రూ.6 వేల నుంచి రూ.15 వేల వరకు మాత్రమే చేపలు పడ్డాయని తెలిపారు. సోమవారం అలల ఉధృతితో చేపల వేటకు వెళ్లలేదు. మంగళ, బుధవారాల్లో నామమాత్రంగా చేపల వేటకు వెళ్లిన వారికి నిరాశే ఎదురైంది. కూలీ, డీజిల్‌ ఖర్చులకు మాత్రమే వస్తున్నాయని ఇలాగైతే ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సోనాబోట్లను అడ్డుకొనేవారే లేరా

తమిళనాడు రాష్ట్రం కడలూరు ప్రాంతానికి చెందిన సోనాబోట్లు నిరాటంకంగా తీరంలో చేపల వేట సాగిస్తుండటంతో మత్స్య సంపద అంతా తుడిచిపెట్టుకుపోతున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా అలల ఉధృతి కారణంగా చేపల వేటకు వెళ్లలేకపోతుంటే సోనాబోట్లు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా తీరంలో వేటాడుతున్నాయని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట్లో మంత్రి స్వామి కేబినెట్‌ సమావేశంలో సోనాబోట్ల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లారని, దీంతో సమస్య పరిష్కారమవుతుందని మత్యకారులు ఆశించారు. కానీ సోనాబోట్లు మాత్రం తీరంలో ఇష్టారాజ్యంగా వేట సాగిస్తున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మత్స్యకారులు, అధికారులు సంయుక్తంగా కొంతవరకు సోనాబోట్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొద్దిరోజులు ప్రభుత్వం సోనాబోట్ల నియంత్రణకు ప్రత్యేక బోటు ఏర్పాటు చేసింది. కానీ కూటమి ప్రభుత్వంలో మాత్రం సోనాబోట్లను అడ్డుకోవటానికి ఒక్క ప్రయత్నమూ చేయలేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఈ సంవత్సరం తమ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, ఏం చేయాలో అర్థం కావటం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం సోనాబోట్లను అడ్డుకుని మత్స్యసంపద కాపాడాలని వారు కోరుతున్నారు.

వేట సొలసి!1
1/1

వేట సొలసి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement