
చెవిరెడ్డి అరెస్ట్ వెనుక కుట్రకోణం
● ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అక్రమ అరెస్ట్ వెనక కూటమి ప్రభుత్వ కుట్రకోణం దాగిఉందని వైపాలెం ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా మద్యం కేసులు బనాయించి ఆయనను అరెస్ట్ చేయడం దారుణమని చెప్పారు. జగన్మోహన్రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైఎస్సార్ సీపీలో క్రియశీలక పాత్ర పోషిస్తున్న చెవిరెడ్డిని అరెస్ట్ చేసి అధికార పార్టీ పైశాచిక ఆనందం పొందాలనుకుంటోందన్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన 12 నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడపలేని, చేతకాని కూటమి నేతలు వ్యతిరేకతను పక్కదారి పట్టించడంలో భాగంగా ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులను టార్గెట్గా చేసుకుంటూ పలు అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు. ఇటీవల జగన్మోహన్రెడ్డికి అండగా నిలబడుతున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్లాంటి వారి మనోధైర్యాన్ని దెబ్బతీసేలా, రాజకీయ ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా, ఆర్థిక మూలాలు కొల్లకొట్టేలా కుట్రలకు పాల్పడుతోందన్నారు. వీరు పెట్టే కేసులు అక్రమమైనవని చెప్పేందుకు కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ ఉదంతమే నిలువెత్తు సాక్ష్యమన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీకి పెరుగుతున్న ప్రజాదరణ, జగన్మోహన్రెడ్డికి వస్తున్న ప్రజా మద్దతును తట్టుకోలేని కూటమి ప్రభుత్వం ప్రశ్నించిన ప్రతి ఒక్కరినీ ఒక క్రమపద్ధతిలో అరెస్ట్లు చేస్తోందన్నారు. ఒక చిన్నస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగిన చెవిరెడ్డి అరెస్ట్, ఆయన కుమారుడిపై మోపుతున్న కేసులు ఏ ఒక్కటి కూడా ఆధారాలతో కాకుండా కక్షలతో మాత్రమే కూడుకున్నవని రాష్ట్ర ప్రజలు గమనించాలన్నారు. పల్నాడులో చనిపోయిన పార్టీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించటానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెళ్తుంటే 30 చెక్ పోస్టులు పెట్టి అనేక ఆంక్షలతో ప్రజలను ఎక్కడికక్కడ కట్టడి చేసే కుటిల ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొట్టారన్నారు. ఎన్ని కేసులు పెడతామంటున్నా, మీ కడుపు మంటతో అరెస్ట్లు చేసినా ఈ ఉడుత ఊపులకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడేది లేదని, రోడ్లన్నీ బారికేట్లతో మూసేసినా పొలం గట్లపై నుంచి కదం తొక్కిన ప్రజా ఆగ్రహాన్ని కూటమి నాయకులు గమనించాలన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని హితవు పలికారు.