
నాటక రంగానికి వన్నె తెచ్చిన నాగినేని
ఒంగోలు మెట్రో: నాటక రంగంలో సంగీతం, సాహిత్యం, నాట్యం, నటన, రచన దర్శకత్వం వంటి అన్ని విభాగాల్లో ప్రభావశీలమైన, స్ఫూర్తిదాయకమైన బాధ్యతలు నిర్వహించిన హార్మోనిస్టు నాగినేని నరసింహారావు నాటక రంగానికి వన్నెతెచ్చారని పలువురు నాటక ప్రముఖులు, కవులు, సాహితీవేత్తలు పేర్కొన్నారు. నాగినేని మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం స్థానిక సీవీఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ఆవరణలో నాగినేని నరసింహారావు 17వ వర్ధంతి సభ నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు మిడసల మల్లికార్జునరావు సంచాలకత్వంలో నిర్వహించిన సభా కార్యక్రమానికి అసోసియేషన్ కార్యదర్శి కనమాల రాఘవులు అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకృష్ణదేవరాయ సాహిత్య, సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షుడు కుర్రా ప్రసాద్ బాబు మాట్లాడుతూ తన ప్రతిభా పాటవాలతో నాటక రంగ బలోపేతానికి నాగినేని నరసింహారావు తన శాయశక్తులా కృషి చేశారన్నారు. విశ్రాంత జిల్లా అటవీ శాఖ అధికారి గుంటూరు సత్యనారాయణ మాట్లాడుతూ 50 ఏళ్ల పాటు పౌరాణిక నాటక రంగానికి సుదీర్ఘ సేవలను అందించి తనలాంటి ఎందరో కళాకారులను తీర్చిదిద్దిన నరసింహారావు సేవలు చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఆదాయపు పన్ను అధికారి మేడబలిని సాంబశివరావు, సాహిత్య సంస్థల ప్రతినిధులు డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు, ఓరుగంటి ప్రసాద్, మిట్నసల శాంతారావు, దేవరశెట్టి సింగయ్య, ఐనంపూడి నరసింహారావు, కొప్పోలు వెంకటేశ్వర్లు, తానికొండ చెన్నయ్య, దామవరపు ముసలయ్య, నలమల్లి పాండురంగనాథం, చోడా రమణయ్య, కొత్తిమీర ప్రేమ్ కుమార్, పాలేటి బాబురావు, తదితరులు పాల్గొన్నారు.