
సంద్రంలో తిరగబడిన బోటు
కొత్తపట్నం: సముద్రంలో అలల ఉధృతికి బోటు తిరగబడింది. ఈ సంఘటన కొత్తపట్నం సముద్రతీర ప్రాంతంలో చోటుచేసుకుంది. మండలంలోని కె.పల్లెపాలెం గ్రామానికి చెందిన సింగోతు బాలకృష్ణ, గొల్లపోతు గోవిందు, సింగోతు వెంకటేశ్వర్లు, కొక్కిలగడ్డ రంగారావు, పనమల సుబ్బారావు, నాయుడు యల్లమంద కలిసి మంగళవారం సాయంత్రం 3 గంటలకు సముద్రంలో వేటకు వెళ్లారు. వేట ముగించుకొని అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తీరానికి వస్తుండగా.. తీరానికి 200 మీటర్ల దూరంలో అలల ఉధృతికి బోటు తిరగబడింది. దీంతో బోటులో ఉన్న ఆరుగురు బోటు కింద పడిపోయారు. అందులో నలుగురు అతికష్టం మీద ఈదుకుంటూ తీరానికి చేరుకున్నారు. కొంత సేపటి తరువాత పెద్ద అల రావడంతో బోటు కింద చిక్కుకున్న మరో ఇద్దరు కూడా తీరానికి చేరుకోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదంలో బోటులో ఉన్న లక్షల విలువైన వలలు గల్లంతయ్యాయి. అలాగే ఇంజన్ పూర్తిగా పనికి రాకుండా పోయింది. లక్షల విలువైన మత్స్య సంపద కూడా కొట్టుకుపోయింది. గొల్లపోతు గోవిందుకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అర్ధరాత్రి కష్టం మీద తీరానికి చేరుకున్న మత్స్యకారులు రూ.లక్షల విలువైన వలలు, మత్స్య సంపద సముద్రంపాలు