
విద్యుత్ అదాలత్తో సమస్యల పరిష్కారం
కంభం: విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి అదాలత్ ఓ మంచి వేదిక అని సీజీఆర్ఎఫ్ చైర్మన్, రిటైర్డ్ జిల్లా జడ్జి ఎన్.విక్టర్ ఇమ్మానియేల్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఏబీ ఫంక్షన్ హాల్లో మార్కాపురం డివిజన్ స్థాయి విద్యుత్ వినియోగదారుల లోక్ అదాలత్, అవగాహన సదస్సు నిర్వహించారు. చిన్నకంభంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల నీటి సమస్య తలెత్తుతోందని, వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కందులాపురం ఇలాకాలో తమ ప్లాట్లకు ఆనుకుని విద్యుత్ మెయిన్ లైన్ స్తంభాలు వేస్తున్నారని, వాటి వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని పలువురు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. లోఓల్టేజీ సమస్యలు పరిష్కరించాలని, విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయని పలువురు అర్జీలు అందజేశారు. ఇలా మొత్తం 20 అర్జీలు రాగా 16 సమస్యలు పరిష్కరించారు. మిగిలిన 4 అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను సీజీఆర్ఎఫ్ చైర్మన్ ఆదేశించారు. అనంతరం విద్యుత్ ప్రమాదాల నివారణ చర్యలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. విద్యుత్ శాఖ ఎస్ఈ కె.వెంకటేశ్వర్లు, సాంకేతిక సభ్యులు ఎస్.శ్రీనివాసరావు, ఆర్థిక సభ్యులు ఆర్సీహెచ్ శ్రీనివాసరావు, కంభం డీఈఈ శ్రీనివాసరెడ్డి, విజిలెన్స్ హెడ్ కానిస్టేబుల్ బి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.